సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వీపర్లకు సరైన అవగాహన లేని ఫలితంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా కచ్చితత్వంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా మ్యాపింగ్, వెరిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువలా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానం లేని సిబ్బందితో ఇబ్బందులు వస్తున్నాయని, డేటా ఎంట్రీ వెరిఫికేషన్, సింక్రనైజేషన్ వంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని పేర్కొంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు లేఖ రాశారు.
బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాల్సి ఉండగా, చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్దే ఉండి ఓటర్లను పిలిపించుకుంటున్నారని, ఇది సర్వే ఉద్ధేశ్యాన్ని దెబ్బ తీస్తోందని తలసాని మండిపడ్డారు. దీనికి తోడు ఈ నెల 11 నుంచి జనాభా గణన (సెన్సస్) బాధ్యతలు అప్పగించారని ,ఏ పని చేయాలో వారికి అర్థం కానీ పరిస్థితి ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి పక్కాగా వెరిఫికేషన్ జరిగేలా బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు. మొబైల్ యాప్ నిర్వహణకు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించాలని, అధికారుల సహాయానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. డెత్ సర్టిఫికెట్లు లేని పక్షంలో తక్షణమే జోనల్ కమిషనర్లు స్పందించి ఈఆర్ఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని తలసాని కోరారు.

అవగాహన లేని వారితో మ్యాపింగ్
– పవన్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పారదర్శకత లోపించిందని, సరైన అవగాహన లేని సిబ్బందిని, స్వీపర్లను బీఎల్ఓలుగా నియమించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవన్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాసిన లేఖను బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కర్ణన్ను బీఆర్ఎస్ నాయకులు పవన్కుమార్ గౌడ్ కలిసి లేఖను అందజేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేయాల్సి ఉండగా అలా చేయడం లేదని, యాప్లో వివరాలు నమోదు చేయడం, మ్యాపింగ్పై సిబ్బందికి కొంత మందికి అవగాహన లేదన్నారు. కొంత మంది సిబ్బంది సర్ కార్యక్రమం పక్కన పెట్టి జనాభా గణన నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజలు కొంత గందరగోళంకు గురవుతున్నారని వివరించారు.