బంజారాహిల్స్,అక్టోబర్ 26: దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన్న సంక్షేమ పథకాలలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు ఇతర అన్ని పథకాల్లో మాదిగలకు సరైన విధంగా న్యాయం చేయాలంటూ వివిధ మాదిగ సంఘాల నాయకులు గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్ను కోరారు. టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ జన్ను కనకరాజు మాదిగ, టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్లశివ మాదిగతో పాటు పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యే దానం నాగేందర్తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తొలివిడత దళితబంధు పథకంలో మాదిగ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగలేదని ఫిర్యాదు చేశారు.
రెండోవిడత దళితబంధు పథకంలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం లబ్ధ్దిదారులను ఎంపిక చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తున్నామన్నారు. దళితబంధు తొలివిడతలో భాగంగా 100మందికి రూ.10లక్షల చొప్పున సాయం అందిందని, రెండోవిడతలో భాగంగా సుమారు 1100 మందికి దళితబంధు అందించనున్నామన్నారు. మాదిగ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకొని జనాభా దామాషా ప్రకారం దళితబంధుతో పాటు గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ తదితర సంక్షేమ పథకాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మాదిగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కే మాదిగల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, గోపి, నర్సింగరావు, అశ్విన్, మహేష్, మైలారం సూరి, శివ పాల్గొన్నారు.