సిటీబ్యూరో: నగరంలో ఇటీవల పోలీస్ కమిషనరేట్ల విభజన స్థానికంగా చాలా సమస్యలను సృష్టిస్తున్నది. హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్సిటీ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీస్స్టేషన్ల విభజనతో కొత్తగా ఏర్పాటైన పీఎస్లతో పాటు, ప్యూచర్సిటీలోకి చేరిన పలు పోలీస్స్టేషన్లను తిరిగి సైబరాబాద్లో కలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు నాలుగు రోజుల్లో సంబంధిత సీపీలకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది.
పునర్విభజనకు ముందు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఆర్జీఐ, మొయినాబాద్ పోలీస్స్టేషన్లను కొత్తగా ఏర్పాటైన ప్యూచర్సిటీలోకి, పలు పీఎస్లను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోకి చేర్చారు. పునర్విభజన తర్వాత ఈ పీఎస్ల నిర్వహణ కొత్తగా కేటాయించిన కమిషనరేట్ల పరిధిలోనే జరుగుతున్నా.. స్థానికంగా మాత్రం పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఒంటెద్దుపోకడలా ఎవరో కొందరికి లబ్ధి చేకూర్చే క్రమంలో ఈ పీఎస్ల పరిధి మార్చారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
విభజన తెచ్చిన తంటా
పోలీస్ స్టేషన్ల దూరానికి సంబంధం లేకుండా, కేవలం స్థానిక మున్సిపాలిటీ పరిధిల ప్రకారం పునర్విభజన జరిగింది. సైబరాబాద్ ప్రాంతంగా చెప్పుకుంటున్న పోలీస్స్టేషన్లు, హైదరాబాద్లో విలీనం కావడమే కాకుండా, ప్రాంతానికి కమిషనరేట్ పరిధికి సంబంధం లేకుండా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సీఎం వరకు తీసుకెళ్లి ఫిర్యాదుదారుల సమస్యలను చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే నాలుగు కమిషనరేట్ల సీపీలతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
పాలనాపరంగా ప్రాంతాల పరిస్థితి ప్రకారం ప్రజలకు పోలీస్స్టేషన్ల సేవలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సమయంలో ఎంతో సౌలభ్యంగా ఉండేది. కానీ వీటిని ఇటీవల జరిగిన పునర్విభజనలో మూడు పోలీస్స్టేషన్లను హైదరాబాద్ కమిషనరేట్లోకి, మరో మూడు పోలీస్స్టేషన్లు ప్యూచర్సిటీ పరిధిలోకి చేర్చడంతో స్థానికంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని బాధితులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఫిర్యాదు గురించి పోలీస్ ఉన్నతాధికారులను కలవాలంటే, సీపీ కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బంది తప్పడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.
మళ్లీ సైబరాబాద్లోకే..!
రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఆరు పోలీస్స్టేషన్లు ఆర్జీఐ, శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్లు ఎప్పటినుంచో రంగారెడ్డి జిల్లా పరిధిలోనే కొనసాగుతున్నాయి. కానీ ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనలో ఆర్జీఐ, శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పీఎస్లను హైదరాబాద్ కమిషనరేట్లోకి చేర్చారు. శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్లు ప్యూచర్సిటీలో విలీనం చేశారు. గతంలో ఈ ఆరు స్టేషన్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండేవి. పాలనాపరంగా ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీటిని తిరిగి పాత కమిషనరేట్ అయిన సైబరాబాద్లోనే చేర్చడానికి నిర్ణయించినట్లు సమాచారం.
గందరగోళానికి అసలు కారణం ఏంటి?
అయితే ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేసి తద్వారా ఏయే పీఎస్లను చేర్చాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయకపోవడమేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆ ఆరు పీఎస్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్స్టేషన్లను అవి ఏ కమిషనరేట్కు దగ్గరగా ఉంటాయో.. అందులో కలిపేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.