సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ) /రవీంద్రభారతి : రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ప్రతివేడుకకు సెట్టింగులతో ఆయా కార్యక్రమాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. గురువారం రవీంద్రభారతిలో నిర్వహించిన పల్లె ప్రగతి సంబురాల సెట్టింగులు అచ్చం పల్లెను పోలిన గుర్తులతో చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇప్పటి వరకు నిర్వహించిన వేడుకలివే..
జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రవీంద రభారతి వేదికగా ఊరూరా చెరువుల పండుగ, సుపరిపాలన దినోత్సవం, సాహిత్య దినోత్సవం, మహిళా సంక్షేమ దినోత్సవం, పల్లె ప్రగతి దినోత్సవం లాంటి రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిన విషయాలను కండ్లకు కట్టినట్లు తెలియజేసే విధంగా రవీంద్ర భారతి ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. కాగా బుధవారం నిర్వహించిన పల్లె ప్రగతి వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి పంచాయతీరాజ్ కార్యదర్శి హన్మంతరావు దగ్గరుడి ప్రత్యేకంగా ఏర్పాట్లును పర్యవేక్షించారు.
పల్లెను తలపించిన సెట్టింగులు..
రవీంద్ర భారతి ప్రాంగణంలో పల్లె ప్రగతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, హరితహారం మొక్కల పెంపకం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, చెత్త సేకరణతోపాటు రీసైక్లింగ్ విధానం, సెట్టింగులతో సంబురాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయా గ్రామాల అభివృద్ధి నమూనా కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రతిమలు, చిత్రాలు, పల్లె ప్రగతి దినోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.