మేడ్చల్ జోన్ బృందం, డిసెంబర్ 30 : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. మూడో రోజూ ప్రజలు దరఖాస్తు చేసేందుకు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. మేడ్చల్లో కమిషనర్ త్రిల్లేశ్వర్రావు ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించారు. గుండ్లపోచంపల్లిలో మున్సిపల్ కమిషనర్ రాములు పర్యవేక్షించారు. మండలంలోని నూతన్కల్, మైసిరెడ్డిపల్లి, రావల్కోల్ గ్రామాల్లో ఎంపీడీవో పద్మావతి, తాసీల్దార్ శైలజ పర్యవేక్షణలో ప్రజాపాలన నిర్వహించారు. ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో వసంత, సర్పంచ్లు కవితా జీవన్, కరుణాకర్, మహేందర్, ఏవో అర్చన పాల్గొన్నారు.
జవహర్నగర్లో ప్రజా పాలన దరఖాస్తులకు విశేష స్పందన లభించింది. శనివారం కార్పొరేషన్లోని 8వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. మొత్తం 5091 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ రామలింగం తెలిపారు. డీఈఈ మాధవాచారి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్యాదవ్, ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు. కీసర మండల పరిధిలోని కరీంగూడ, యాద్గార్పల్లి గ్రామాల్లో ఆరు గ్యారెంటీకు సంబంధించి గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది అందజేసిన దరఖాస్తు ఫారాలను ప్రజలు నింపి నేరుగా గ్రామసభల్లో అధికారులకు అందజేశారు. కీసర ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కరీంగూడ సర్పంచ్ కౌకుట్ల గోపాల్రెడ్డి, పుట్ట రాజు, ఎంపీటీసీలు కిరణ్జ్యోతి, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో శనివారం అధికారులు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 3వ వార్డు కేంద్రాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించారు. అదేవిధంగా ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్, కొర్రెముల గ్రామాల్లో శనివారం జరిగిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్గౌడ్, సర్పంచ్ జలజాసత్యనారాయణరెడ్డి, కార్యదర్శి కవిత, అధికారులు పాల్గొన్నారు.
బోడుప్పల్ నగర పరిధిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు అధికారులు 33 కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం పలు కౌంటర్ల వద్ద దరఖాస్తు ఫారాలు లభించక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులతో మాట్లాడి దరఖాస్తుల కొరత సమస్యను పరిష్కరించినట్లు మేయర్ బుచ్చిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శనివారం మూడో రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పలు కేంద్రాలను మేయర్ జక్క వెంకట్రెడ్డి సందర్శించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.