Hyderabad | సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోని పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా పోలీసింగ్గా తీర్చిదిద్దుతున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ వెంటనే పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. పోలీస్ శాఖలో తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ, ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్తో పటిష్టమైన శాంతి భద్రతలు ఏర్పడ్డాయి. నేరాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ..ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ 9 ఏండ్లలో కల్పించారు. ప్రశాంతత అంటే ఇలా ఉండాలని, దేశానికే ఒక రోల్మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్
నేర రహిత సమాజ స్థాపనకు తెలంగాణలో ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ నేరస్తులకు మాత్రం సింహ స్వప్నంగా మారుతున్నారు. దీంతో పోలీసులపై నేడు ప్రజలు పూర్తి విశ్వాసాన్ని పెంచుకున్నారు. మరో పక్క ‘హాక్ ఐ’ యాప్తో పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగిస్తున్నారు. పలు రకాలైన సేవలను ఆన్లైన్లోనే అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
‘నిఘా’ నేత్రాలు
పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా టెక్నాలజీని తెలంగాణలో పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. సీసీ కెమెరాలు, ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 7.5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలు కలిగిన నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా వ్యవవస్థను పటిష్టం చేశారు.
అధునిక పెట్రోలింగ్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక పెట్రోలింగ్ కార్లు, బ్లూకోట్స్ వాహనాలను సమకూర్చారు. డయల్ 100 నుంచి పెట్రోలింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీంతో బాధితులు ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో ఘటన స్థలికి పోలీసులు చేరుకుంటూ అత్యంత వేగంగా పోలీస్ సేవలను అందిస్తున్నారు.
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ముఖ్య ప్రాంతాలు, డ్యామ్లు, ప్రార్థన, పర్యాటక సంస్థలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నెట్వర్క్ను దీనికి అనుసంధానం చేశారు. అలాగే విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ఇక్కడి నుంచి ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు తగిన ఏర్పాటు చేశారు.
మహిళల భద్రత-భరోసా
మహిళల భద్రతకు తెలంగాణలో పూర్తి భరోసా ఉంది. రాష్ట్రం ఏర్పడగానే పోకిరీల భరతం పట్టేందుకు ప్రభుత్వం షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ ఏర్పడిన కొద్ది సమయంలోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించింది. ప్రతి మహిళకు షీ టీమ్స్ మాకు అండగా ఉన్నాయనే భరోసాను నింపాయి. మన షీ టీమ్స్ పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. అలాగే ఐటీ కారిడార్లలో మహిళల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
సైబర్ నేరాలపై
సైబర్ నేరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే డ్రగ్స్పై పటిష్ట చర్యలు తీసుకుంటూ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
నిరంతరాయంగా ట్రాఫిక్
ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగర శివారులలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతూ ైప్లెఓర్లు, అండర్పాస్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సాఫీగా ట్రాఫిక్ సాగే నగరాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి వరుసలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలు ప్రజలు పాటించే విధంగా వారిలో అవగాహన కల్పిస్తూ, పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడంతో వాహనదారుల్లో క్రమ శిక్షణ పెరిగి ప్రయాణం సుఖవంతమవుతున్నది.
ప్రపంచంలో బెస్ట్ సిటీగా హైదరాబాద్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పోలీస్ విభాగానికి దిశా నిర్దేశం చేస్తూ కావాల్సిన వనరులను అందించడంతో నేడు హైదరాబాద్ను సురక్షితమైన నగరంగా తీర్చిదిద్ద్దాం. అధునీక టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్తో హైదరాబాద్ను ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో ఒకటిగా మార్చగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడ దొంగతనం జరుగుతుందో..ఎక్కడ స్నాచింగ్, మహిళలపై దాడి ఎక్కడ జరుగుతుందోననే ఆందోళనలో ప్రజలు ఉండేవారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరు హాయిగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు. డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నేడు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. ఇంత ప్రశాంత వాతావరణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైంది. 9 ఏండ్లుగా ఒక్క చిన్నపాటి మతపరమైన గొడవలు జరుగలేదంటే పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ ఉండడం, తద్వారా పటిష్టమైన శాంతి భద్రతలు కొనసాగుతుండడమే కారణం.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
సురక్షిత నగరంగా అంతర్జాతీయ గుర్తింపు
సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే సురక్షితంగా నగరంగా మారింది. మహిళ భద్రతకు పెద్దపీట వేస్తూ ఈవ్టీజింగ్ను అరికట్టడంలో షీ టీమ్స్ను అందుబాటులోకి తెచ్చారు, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తున్నది. ఈ ముప్పు నుంచి యువతను కాపాడేందుకు ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. సామాన్య ప్రజలు డయల్ 100కు ఫోన్ చేస్తే పట్టణ ప్రాంతాలలో 5 నిమిషాల్లో రాచకొండలోని గ్రామీణ ప్రాంతాలలో 6.3 నిమిషాలలో పోలీసులు ఘటన స్థలికి చేరుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రజలకు పోలీసుల నుంచి నాణ్యమైన, వేగంవంతమైన సేవలు అందించడానికి సీఎంకేసీఆర్ టెక్నాలజీతో కూడిన ఎన్నో సౌకర్యాలను పోలీసులకు అందించారు.
-డీఎస్ చౌహాన్, రాచకొండ పోలీస్ కమిషనర్
నెక్ట్స్ జనరేషన్ పోలీసింగ్పై ఫోకస్..
నెక్ట్స్ జనరేషన్ పోలీసింగ్పై ఫోకస్ పెట్టాం. సైబరాబాద్ పోలీసింగ్ అంటే కేవలం ఒక ప్రాంతానికో లేదా తెలంగాణ రాష్ర్టానికో పరిమితం కాదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత సైబరాబాద్ అనేది అంతర్జాతీయ హబ్గా మారింది. దీనికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు రాగకపోకలు సాగించడం, బస చేయడం, ఉద్యోగాలు ఇలా రకరకాలుగా ఫ్లోటింగ్ ఉండడంతో సైబరాబాద్ అనేది మినీ గ్లోబల్గా మారింది. అందుకోసం ప్రతి ఒక్కరి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలకు భద్రత కల్పించాలనేది సీఎం కేసీఆర్ విజన్. ఆయన మార్గదర్శకాల మేరకు సైబరాబాద్ పోలీసింగ్ను అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మెగా పోలిసింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూనే నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా ఉంటూ క్రైమ్ రేటును తగ్గిస్తున్నాం. సైబరాబాద్ను మరింత బలోపేతం చేసే క్రమంలో రెండు కొత్త లా అండ్ ఆర్డర్ డీసీపీ జోన్లు, మూడు ఏసీపీ డివిజన్లు, 11 పోలీస్స్టేషన్లు, రెండు ట్రాఫిక్ జోన్లు, మూడు ట్రాఫిక్ డివిజన్లు, ఒక ట్రాఫిక్ పిఎస్తో పాటు నేరాల నియంత్రణ కోసం 2 సీసీఎస్ స్టేషన్లు, ఆర్థిక నేరాల నియంత్రణ కోసం ఈఓడబ్ల్యూ విభాగం, మహిళలు, పిల్లల భధ్రత కోసం ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించాం. త్వరలో డ్రోన్ రెస్పాండ్ సిస్టమ్, సెక్సువల్ అఫెండర్స్ రిజిస్ట్రీని అందుబాటులోకి తీసుకురానున్నాం. మొత్తనికి తెలంగాణ పోలిసింగ్ అంటే అంతర్జాతీయ పోలీసింగ్ అని చెప్పవచ్చు.
– స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీసు కమిషనర్