Hyderabad | సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచుకొని తిరిగి కుటుంబ సమేతంగా నేపాల్కు పయనమవుతున్నారు. ఇది నేపాలీ ముఠాల దొంగతనం తీరు. ఈ ముఠాలు దొంగతనం పూర్తికాగానే బస్సులు, రైళ్లు, విమానాల్లో దేశ సరిహద్దులను దాటేందుకు ఎత్తులు వేస్తుంటారు.
ఇలాంటి నేపాల్ ముఠా ఒకటి సికింద్రాబాద్లోని ఓ బడా వ్యాపారి ఇంట్లో కొంత కాలం నమ్మకంగా ఉండి.. ఇటీవలే రూ.5 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు అపహరించి పారిపోయింది. నిందితులను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కూడా ఈ తరహా నేరాలు జరిగాయి. నిందితులను సైతం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనుక్కి పంపించారు. గతంలో అరెస్టయిన కొన్ని నేపాల్ ముఠాల వివరాలిలా ఉన్నాయి..
గ్యాంగ్లు అరెస్ట్
ఏడాది కిందట మూసారాంబాగ్లోని ఓ ఇంట్లో సర్వెంట్గా పనిచేసిన రేఖ, ఆ ఇంటి గూర్చి పూర్తి వివరాలు తెలుసుకొని.. తన గ్యాంగ్ సభ్యులైన కమల్షాహి మనోజ్, చంద్, బిషాల్ షాహి, ఆమె భర్త అశోక్కు చేరవేసింది. ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లడంతోనే ఇంట్లోకి చొరబడిన రూ.12 లక్షల సొత్తును అపహరించి పరారయ్యారు. నిందితులు దేశ సరిహద్దులు దాటకుండా తొలుత కట్టడి చేసిన మలక్పేట్ పోలీసులు అందరిని అరెస్టు చేశారు.
పనిలో చేరే వారి గూర్చి తెలుసుకోండి.!
గుర్తు తెలియని వ్యక్తులను పనిలో చేర్చుకోవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి వాచ్మన్, పని చేసేవాళ్లు, డ్రైవర్లను పనిలో చేర్చుకునే ముందు వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు హాక్ ఐ యాప్ను కూడా ఉపయోగించుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నమ్మకంతో ఉన్నట్లు నటించి.. అవకాశం చిక్కగానే ఈ ముఠాలు దొంగతనాలు చేస్తుంటాయని పేర్కొన్నారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని నగర పోలీసులు సూచిస్తున్నారు.
కూకట్పల్లిలో..
కూకట్పల్లిలోని ధర్మారావు ఇంట్లో పనిలో చేరిన చక్రధర్ జీ, అతడి భార్య సత్యధర్జీ, మరోవ్యక్తి ఉపేంద్ర ప్రదీప్ కొన్నాళ్లు నమ్మకంగా పనిచేశారు. ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్లడంతో.. అదే అదనుగా భావించిన ఈ ముఠా ఇంట్లో నుంచి కోటి రూపాయల సొత్తును అపహరించి, పారిపోయారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు తొలుత నిందితులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేశారు. గట్టినిఘా పెట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
నాచారంలో..
నాచారంలోని ఓ ఇంట్లో పనిచేసిన అమర్ బహదూర్, లిల్ బహదూర్ కమి, అశోక్ కరన్ సింగ్ ఖానే, విశ్వకర్మ సాగర్, జానవిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాపై రాచకొండ పోలీసులు గతేడాది పీడీ యాక్టు కూడా ప్రయోగించారు.