రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ్యలో అతివలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 2600 సిటీ బస్సుల్లో ‘జీరో టికెట్’తో ప్రయాణించారు. గ్రేటర్ పరిధిలో ప్రతి రోజూ సుమారు ఆరు లక్షల మంది ఆడబిడ్డలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు. జీరో టికెట్తో రోజులో ప్రయాణ చార్జీలు కనీసం రూ.100 నుంచి రూ. 150 వరకు మిగిలే అవకాశాలు ఉన్నాయన్నారు. అంతకుముందు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకంతో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా గాంధీ వైద్యశాలలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, శామీర్పేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ ఈ రెండు పథకాలను ప్రారంభించారు. రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్య శ్రీతో జిల్లాలో ఉన్న 27 ప్రభుత్వ వైద్యశాలలతో పాటు 56 ప్రైవేటు ఆస్పత్రులు, 85 పీహెచ్సీల్లో మొత్తం 1672 రకాల వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకాన్ని శనివారం ప్రారంభించారు. దీంతో నగరంలోని దాదాపు 29 డిపోల పరిధిలో ఉన్న మొత్తం 2600 సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మధ్యాహ్నం 1.30 తర్వాత నుంచి నగర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నట్లు ఆర్టీసీ బస్ కండక్టర్లు తెలిపారు. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి ప్రారంభించారు.
జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెరిగిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా శనివారం నుంచే అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, ఆర్డీవో రవికుమార్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ మహబూబ్పాషా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శామీర్పేట్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాలను జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 5 లక్షల పరిమితి ఉన్న ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు, వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.
కొండాపూర్: రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి సేవల(పోస్టర్)ను కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో శనివారం ప్రారంభించారు.