సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ సంక్షేమ పథం పరిమళిస్తున్నది. డబుల్ ఇండ్లు.. పేదల సొంతింటి కల సాకారం చేస్తుంటే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆడపడుచుల మోములో కల్యాణ కాంతులు నింపుతున్నది. ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు ‘ఆసరా’నిస్తుంటే.. దళితుల జీవితాలకు ‘దళిత బంధు’ ఆర్థిక చేయూతనిస్తున్నది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ విద్యార్థుల ఉన్నత చదువులకు బాసట అవుతున్నది. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ.. బీఆర్ఎస్ సర్కారు అందరికీ బంధువై.. కంటికి రెప్పలా.. ఇంటికి దీపంలా మారింది.
హైదరాబాద్ మహానగరం సంక్షేమ పథంలో అగ్రభాగాన నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. సొంతింటి కల సాకారం చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంతో ప్రారంభమైన డబుల్ ఇండ్లు పేదలకు వరంగా మారాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడపడుచుల కండ్లల్లో ఆనందం నింపుతుంటే.. దళితబంధు పథకంతో ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆసరానిస్తూనే.. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వేస్తున్నది ప్రభుత్వం.
– సిటీబ్యూరో,మార్చి 24 (నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. దళితులు కూడా అన్ని రంగాలలో రాణించాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున జిల్లాలో 1500 మందికి ఎంపిక చేయగా.. అందులో 16 మంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోకి వెళ్లారు. దీంతో మిగతా 1484 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఈ పథకం కోసం రూ.148.40 కోట్ల నిధులు వెచ్చించారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన దళిత వర్గాలకు చెందిన వారిలో కొందరు క్యాబ్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేయగా. మరికొందరు కిరాణాషాపులు, టెంట్హౌస్లు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా లబ్ధిపొందిన వారంతా ఎవరికి వారు స్వయం ఉపాధి పొందడంతో పాటు.. మరికొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. తొలివిడుత దళిత బంధు పథకం సక్సెస్ కావడంతో.. రెండో విడుతను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలోని బీసీ విద్యార్థుల విద్య కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎనిమిదేండ్ల కాలంలో 4,66,777 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేసింది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.239.58 కోట్లు కేటాయించింది.
బీఈ/బీటెక్, యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు పరుస్తున్నది. ఇందులో భాగంగా గత 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,57,312 మంది విద్యార్థులకు రూ.585.68 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేటాయించింది. ఇందులో ఆర్థికంగా వెనకబడిన (ఈబీసీ) విద్యార్థులు 74,540 మందికి రూ.174.23 కోట్లు ఖర్చు చేసింది.
హైదరాబాద్ జిల్లాలోని మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు దాదాపు 46.54 శాతం ఉన్నారు. వీరికోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లతో పాటు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నది. అందులో భాగంగానే చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ల పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నారు. మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది. 2015 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,120 మంది విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూ.367.09 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.
హైదరాబాద్ నగరంలో నిలువ నీడలేని వారు, పూరి గుడిసెల్లో నివసించే వారు సగర్వంగా తలెత్తుకొని సొంత ఇండ్లల్లో నివసించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం నుంచి పుట్టిన డబుల్ బెడ్రూం పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాలలో ఉన్న నిరుపేదలను గుర్తించిన ప్రభుత్వం.. రూ.568 కోట్లతో మొత్తం 37 కాలనీల్లో డబుల్ ఇండ్లను కట్టించి ఇస్తున్నది. ఇప్పటికే 9,477 ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. ఇందులో 5,836 నిర్మాణాలు పూర్తి కాగా.. 3,280 మంది లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించారు.
2014-15 నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకం ద్వారా 1,30,477 మంది ఆడపడుచులు లబ్ధి పొందగా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,204.61 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 96,334 మంది మైనారిటీ వర్గానికి చెందిన వారు. దీనికి సర్కారు రూ.804.56 కోట్లు ఖర్చు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో ప్రతినెలా 1,47,844 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. వీటి కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.55.74 కోట్లు కేటాయిస్తున్నది. తాజాగా మరో 1,26,951 మంది లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం.. రెండో విడుతలో వీరికి కూడా పింఛన్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులతో పాటు డయాలసిస్ పేషెంట్లు, హెచ్ఐవీ రోగులకు కూడా ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల చొప్పున ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి బిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం అమలు చేయడం సంతోషంగా ఉన్నది. ఆడపిల్ల పెండ్లి అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అలాంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ పెద్ద మనసు చాటుకొని లక్షా116 అందజేయడం ఆనందంగా ఉంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి పథకం ప్రవేశపెట్టలేదు. సీఎం కేసీఆర్ ది గొప్ప మనసు. ఆడపిల్ల పెండ్లి బరువు దించిన పెద్దన్నకు రుణపడి ఉంటాం.
– స్వరూప, కల్యాణలక్ష్మి లబ్ధిదారు, తిరుమలగిరి
మా బిడ్డ పెండ్లికి షాదీముబారక్ పెద్ద ఆసరా అయ్యింది. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మాలాంటి వారికి ఎంతో అండగా నిలుస్తున్నారు. ఈ మధ్యే నా బిడ్డ పెళ్లి చేసిన. షాదీముబారక్ పథకం కింద దరఖాస్తు చేస్తే… నాకు ప్రభుత్వం నుంచి రూ.లక్ష 116లు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
– నసీంభాను, పాటిగడ్డ, సనత్నగర్