ఖైరతాబాద్: నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండా మరికొందరి ప్రమేయమూ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ వ్యవహారం కొనసాగుతున్నదన్న ఆరోపణలున్నాయి. 2023 నవంబర్లో నిందితుడు నాగరాజు పరిచయమైనట్లు బాధితులు చెబుతుండగా, రెండు సంవత్సరాలకు పైగానే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.
డయాలసిస్ రోగులతో వార్డులోనే సంప్రదింపులు జరుపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నా.. విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల విధులను పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజర్లపై ఉంటుంది. వార్డు బాయ్ల పనితీరును ఎప్పటికప్పుడు గమనించాలి. ఈ వ్యవహారం ఇంత కాలం బయటపడక పోవడంపై ఆస్పత్రి ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ఈ విభాగంలోని ఉద్యగులందరినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఓ డిప్యూటీ స్థాయి వైద్యాధికారిపై ఉంటుంది.
కానీ రెండు సంవత్సరాలకు పైగా ఈ వ్యవహారం సాగుతున్నా.. పట్టించుకోకపోవడంపై పలువురు ఉద్యోగులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో మరెవరైనా ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా..? డబ్బుల లావాదేవీలు ఎవరెవరి ద్వారా జరిగాయి..? ఎంత మంది బాధితులు ఉన్నారు..? అనే కోణాల్లో పోలీసుల విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. యాజమాన్యం సైతం అంతర్గత విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.