మియాపూర్, జనవరి 9: కంటి సమస్యలు ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్రెడ్డిలతో కలిసి సోమవారం కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మొదటి దశ విజయవంతగా పూర్తి కావడంతో కంటి వెలుగు రెండో దశను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు.
ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 100 రోజుల పాటు కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటి విడత కంటి వెలుగులో 1.83 లక్షల మందిని పరీక్షించి 40 వేల మందికి రంటి అద్దాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇదే స్పూర్తితో రెండో దఫాలో అవసరమైన వారికి కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు, కండ్ల అద్దాలు అందించి బార్ కోడ్లను ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు క్యాంపుల నిర్వాహణ ఉంటుందని మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉండటంతో పాటు ఆప్టో మెట్రిస్ట్ 1, సూపర్వైజర్ 1, ఏఎన్ఎం 2, ముగ్గురు ఆశ, బీఈఓ 1 టీంలో సభ్యులుగా ఉండనున్నట్లు తెలిపారు.
కంటి వెలుగు కేంద్రాలు..
కొండాపూర్ డివిజన్లోని అంజయ్యనగర్లో సగర సంఘం కమ్యూనిటీహాల్, మార్తాండనగర్ ప్రభుత్వ పాఠశాలలో, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి తండాలోని మహిళ భవనం, రాయదుర్గం వార్డు కార్యాలయం, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు సురభి కాలనీ కమ్యూనిటీ హాల్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కల్చరల్ క్లబ్, సుభాష్చంద్రబోస్ నగర్లోని సెయింట్ ఇసాక్ పాఠశాల, గోకుల్ ప్లాట్స్ కమ్యూనిటీహాల్, మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కమ్యూనిటీహాల్, జేపీ నగర్ కమ్యూనిటీహాల్, హఫీజేపేట్ డివిజన్ పరిధిలోని మహిళ భవనం, గంగారం కమ్యూనిటీహాల్, చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం, వేమన కాలనీ కమ్యూనిటీహాల్, దీప్తీశ్రీ నగర్ కమ్యూనిటీహాల్, భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీలో, హైదర్నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీహాల్, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కమ్యూనిటీహాల్, వివేకానందానగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్ కాలనీ, కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలోని మోడల్ మార్కెట్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు విప్ గాంధీ తెలిపారు.