సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.6 డిగ్రీలు, గాలిలో తేమ 22శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.