సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాటు చేసిన నివారణ చర్యలను మరింత విస్తృతం చేసింది. ఈ మేరకు సీజనల్పై వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరం పరిధిలో ఉన్న 166 బస్తీ దవాఖానలు, 94 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్కు సంబంధించి పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులో ఉంచామని, 134 రకాల వైద్య పరీక్షలు కూడా అన్ని బస్తీ దవాఖానల్లో నిర్వహిస్తామన్నారు. సీజనల్ లక్షణాలతో వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన వైద్య సేవలందించాలని, ముఖ్యంగా డెంగీ, మలేరియా అనుమానితులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వచ్చిన వైద్య నివేదికల ఆధారంగా అవసరమైన చికిత్సను అందించాలని ఆదేశించారు.
వైద్య పరీక్షలకు గానీ, చికిత్స కోసం బయటి డయాగ్నోస్టిక్ సెంటర్లు లేదా హాస్పిటల్స్కు రెఫర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగి ఆరోగ్యస్థితి మేరకు అడ్మిషన్ చేయాల్సి వస్తే ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ దవాఖానలు వంటి ట్రెషరీ దవాఖానలకు రెఫర్ చేయాలని సూచించారు. ప్రజలు సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు, ఫ్లూయిడ్స్, వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు డా.వెంకటి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలలో డెంగీ, మలేరియాకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలతోపాటు అవసరమైన చికిత్స అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.