కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండటంతో కాషాయం ఖాళీ అయ్యే దుస్థితి ఏర్పడింది. దీంతో బెదిరిపోయిన రాష్ట్ర అధినాయకత్వం బుజ్జగింపుల పర్వానికి తెరలేపింది.
– సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండటంతో కాషాయం ఖాళీ అయ్యే దుస్థితి ఏర్పడింది. దీంతో బెదిరిపోయిన రాష్ట్ర అధినాయకత్వం బుజ్జగింపుల ప్రక్రియ చేపట్టింది. ఎన్నికల ప్రచార పనుల్లో ఎవరికి వారు బిజీగా ఉన్న నాయకులంతా హుటాహుటినా నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లు, ఆశావహులు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే త్వరలో జరిగే బీసీ గర్జన సభ కోసం సమావేశమని చెప్పినప్పటికీ అధిక భాగం పార్టీ ఫిరాయింపులపైనే చర్చలు జరిగాయి.
గ్రేటర్లో మొన్న అంబర్పేట కార్పొరేటర్ పద్మ దంపతులు, నిన్న హిమాయత్నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మిరామన్ గౌడ్ దంపతులు బీఆర్ఎస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీళ్ల దారిలోనే మరి కొంతమంది కార్పొరేటర్లు, టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, నాంపల్లి, మల్కాజిగిరి, కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి భారీగా బీజేపీ నాయకుల వలసలు బీఆర్ఎస్లోకి ఉండబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధిష్ఠానం అసంతృప్తులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ మారొద్ద్దని బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందంటూ ఓ సీనియర్ నాయకుడు చెప్పాడు.
ఇదే సమావేశంలో ఓ కార్పొరేటర్ పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో బాగలేదని, ఓటమి ఖాయంగా కనిపిస్తుందని తన మనసులో మాట చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ అభిప్రాయాలే అక్కడున్న అధిక శాతం మంది వ్యక్తం చేయడంతో అలాంటి పరిస్థితి ఏమీ ఉండదని హై కమాండ్ నాయకులు వారించే ప్రయత్నం చేశారు. పార్టీలోనే ఉండండని నచ్చజెప్పారు. కోరుకున్నట్టుగానే అందరికి న్యాయం చేస్తామని హామీచ్చినట్టు తెలిసింది. కాగా, సమావేశం జరుగుతుండగానే గ్రేటర్లోని పలు నియోజకవర్గాల నుంచి అసంతృప్తులు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా తదితరులంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తుంటే పార్టీకి ఊపు రావాల్సింది పోయి ఉన్న నాయకులు, క్యాడర్ పార్టీ విడిచి వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఇప్పటికే టికెట్ రాని వారిని బుజ్జగించే పనిలో ఉన్న కిషన్రెడ్డి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరుతుండటం ఆయనకు గుబులు పుట్టిస్తున్నది. ఓ వైపు సీఎం కేసీఆర్పై మీడియా సమావేశాల్లో విమర్శలు చేస్తుంటే అదే పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతుండటం విశేషం. రాష్ట్ర బీజేపీ నాయకుడి మాటలు వినే పరిస్థితి కూడా లేకపోవడంతో కిషన్ రెడ్డి మరో ప్రయ్నతంగా ఒక్కొక్కరితో రహస్య మంతనాలు ఏర్పాటు చేసి వారి డిమాండ్లను పరిష్కరించే పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మతోన్మాద శక్తులను ప్రజలు విశ్వసించరు
మైలార్దేవ్పల్లి, నవంబర్ 4 : మతోన్మాద శక్తులను, దాడులకు పాల్పడే నాయకులను ప్రజలు ఎప్పుడు విశ్వసించరని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజల్లో ఉండే నాయకుడినే ప్రజలు కోరుకుంటారు తప్ప అహంకారంతో కండ్లునెత్తికెక్కిన వారిని కాదన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తోకల సుధాకర్రెడ్డి, మహిళా నాయకురాలు శరణమ్మలు వారి అనుచరులతో శనివారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే వారు ఎవరో, అబద్ధపు మాటలు చెప్పే వారు ఎవరో ప్రజలకు పూర్తిగా తెలుసు అని అన్నారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కూడా తెలుసు అని, అందుకే తనకు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన తోకల సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. అధికార దాహంతో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడ్డి ఒంటెద్దు పోకడలు భరించలేకపోతున్నామన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తోకల శ్రీనివాస్రెడ్డి ఆగడాలను భరించలేకే పార్టీ వీడుతున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సంక్షేమాలు, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.