తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ అమరుల స్మారకం వద్దకు తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు వారీ వారీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు..బోనాలు, కాలిగజ్జలతో కళాకారుల ప్రదర్శనలు టాంక్బండ్ పరిసరాల్లో హోరెత్తాయి. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ సాగిన కళల ప్రదర్శన ఆద్యంతం ఉద్వేగంగా సాగింది.
అమరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని గురువారం సుమారు 6 వేల మంది కళాకారులు సకల కళలు ప్రదర్శించారు. ఫోక్, ట్రైబల్, దక్కన్ ఆర్ట్ కళాకారులు అమరవీరులకు జోహార్లు అర్పించేందుకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ర్యాలీ తీశారు. సీఎం కేసీఆర్ స్మారక జ్యోతిని ప్రారంభించిన అనంతరం అమరులకు కొవ్వొత్తుల దీపాలతో నివాళులర్పించారు. అనంతరం 800 డ్రోన్లతో తెలంగాణ అభివృద్ధిని ఆవిష్కరిస్తూ సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది.
– సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ)