సరికొత్త ఆవిష్కరణలు పరిచయమయ్యాయి. ఆలోచనలతో కూడిన అంకురాలు.. సామాజిక కోణాలను ఆవిష్కరించాయి. హెచ్ఐసీసీలో శుక్రవారం బయో ఏషియా సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ సదస్సులో 75 ఫార్మారంగ స్టార్టప్స్ కొలువుదీరాయి. వైద్యరంగంలో వినూత్నమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, నియంత్రణకు చికిత్సా విధానాలు, పరిశోధనల్లో కనుగొన్న పరికరాలు, ఔషధాలు… యువ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల ఆవిష్కరణల పరిచయాలకు ఈ సదస్సు వేదికగా నిలిచింది. బయోటెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లోకి రానున్న స్టార్టప్ కంపెనీలకు నూతన ఉత్సాహాన్నిచ్చింది. మూడు రోజుల పాటు సాగే ఈ ‘బయో ఏషియా’ అంతర్జాతీయ సదస్సులో తొలిరోజు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు తరలివచ్చి.. ఎగ్జిబిట్లను పరిశీలించి..తమ ఆలోచనలను పంచుకున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
సైన్సు రంగంలో నిరంతర పరిశోధనలు, ఆవిష్కరణల వల్లే సామాన్యులకు మరింత కచ్చితమైన సులువైన వైద్యం అందుబాటులోకి వస్తున్నది. వ్యాధుల అంతు చూసే వైద్యులకు, వాటిని రూపుమాపే ఔషధాలకు మధ్య రోగ నిర్ధారణ చేసి స్పష్టమైన నిర్ధారణనిస్తున్నది ఆధునిక వైద్య పరికరాలు. అయితే ఈ వ్యవస్థలన్నింటినీ సమన్వయ పరిచి ఏకతాటిపైకి తీసుకొచ్చేలా అనేక స్టార్టప్లు రూపొందిస్తున్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడిసిన్ వంటి రంగాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటికి సాఫ్ట్వేర్లు రూపొందించి అటు వైద్యులకు, ఇటు రోగులకు చక్కటి వారధిలా మారిన అటువంటి స్టార్టప్లు కొన్ని బయోఏషియా సదస్సులో కొలువు దీరాయి. శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, పలు కంపెనీల సీఈవోలు వీటిని ఆసక్తిగా సందర్శించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్ : బయో ఏషియా సదస్సు శుక్రవారం హెచ్ఐసీసీలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పలు స్టార్టప్ కంపెనీలు 75 నూతన ఆవిష్కరణలను పరిచయం చేశారు. వైద్యరంగంలో వినూత్నమైన పరిశోధనలకు, శాస్త్ర సాంకేతికపరంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు వేదికగా సదస్సు నిలిచింది. బయోటెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లోకి రానున్న స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సు నూతన ఉత్సాహాన్నిచ్చింది.
75 స్టార్టప్లు
ఈ సదస్సులో పాల్గొనేందుకు 400 స్టార్టప్లు దరఖాస్తు చేసుకోగా వాటిలో 75 స్టార్టప్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలు నూతన ఆవిష్కరణలను పరిచయం చేశాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి లైఫ్ ైస్టెల్ వ్యాధిగా మారిన మధుమేహం, బీపీ వంటి వ్యాధుల వరకు నివారణ, నియంత్రణకు చికిత్సా విధానాలు, పరిశోధనల్లో కనుగొన్న పరికరాలు, ఔషధాలను పరిచయం చేశారు. యువ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కనుగొన్న కొత్త ఆవిష్కరణలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఏవిధంగా తమ ఉత్పత్తి విధానాలను మార్చుకోవాలనే విషయమై సదస్సులో దిశానిర్దేశం చేశాయి. మొత్తంగా బయో ఏషియా సదస్సు ఆలోచనలను పంచుకుని..అద్భుతాల ఆవిష్కరణకు వేదికగా నిలిచింది.
అద్దెకు బయోల్యాబ్స్
బయోల్యాబ్ లేదా బయో కంపెనీ ఏర్పాటు, నిర్వహణ కాస్త శ్రమతో కూడుకున్న పని. అయితే ఇటువంటి ల్యాబ్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి టైసెల్ బయోపార్క్ అనే సంస్థ అతి తక్కువ ధరకే కార్పొరేట్, నాన్ కార్పొరేట్ తరహాల్లో పూర్తి సెటప్ చేసి అందిస్తుంది. వీటికి రోజు వారీ లేదా నెల వారీ అద్దె వసూలు చేస్తారు. ఇప్పటికే ఈ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు ఇతర రాష్ర్టాల్లో టైసెల్ బయోపార్క్ పలు బయో ల్యాబ్స్లను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చింది.
లైఫ్ సైన్స్కు..ఇంక్యుబేటర్
హైదరాబాద్కు చెందిన ఐకేపీ నాలెడ్జ్ పార్కు లైఫ్ సైన్స్ రంగానికి ఇంక్యుబేటర్లా వ్యవహరిస్తున్నది. ఈ కంపెనీ సీఈవోగా దీపన్వితా వ్యవహరిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఐకేపీ నాలెడ్జ్ పార్క్కు హైదరాబాద్లో పలు కార్యాయాలు ఉన్నాయి. కర్ణాటకలోనూ సేవలను విస్తరించే యోచనలో ఉన్నారు. ఇంక్యుబేషన్ స్పేస్లు, ల్యాబ్ సౌకర్యాలు, గ్రాంట్లు, ఫండింగ్ ప్రోగ్రామ్స్తోపాటు ఐపీ అండ్ పేటెంట్లను తమ కంపెనీ అందిస్తున్నదని ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వైస్ ఛైర్మన్ డాక్టర్ విశ్వంధం దుప్పట్ల, హైదరాబాద్ కో-ఆర్డినేటర్ దేదీప్యలు తెలిపారు.
నిల్చుంటే చాలు.. నిమిషంలోనే
మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి అనేక రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైతే ఈసీజీ వంటివి చెక్ చేయాలి. ఇలాంటివాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్ కంపెనీ ఓ పరికరాన్ని రూపొందించింది. వెయింగ్ మిషన్పై నిల్చుంటే చాలు బీపీ, ఆక్సిజన్, టెంపరేచర్, గ్లూకోస్ లెవల్స్, ఈసీజీ, హృదయ స్పందన వంటి వివరాలన్నీ కేవలం నిమిషం వ్యవధిలోనే తెలియజేసి డిస్ప్లే చేస్తుంది. కొవిడ్ రాకకు పూర్వమే దీన్ని రూపకల్పన చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు మార్కెట్లోకి తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేందుకు కంపెనీ నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
50 దేశాల నుంచి..
బయో ఏషియా సదస్సులో 50 దేశాలకు చెందిన లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ ప్రముఖులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరాగా సదస్సు ప్రాంగణం సందడిగా మారింది. సదస్సు ప్రారంభోత్సవానికి యువత కూడా భారీగా హాజరైంది. వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టార్టప్ కంపెనీలతోపాటు ఐటీ ఉద్యోగులు తరలివచ్చి స్టాల్స్లో ఏర్పాటుచేసిన సాంకేతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
మీ ఆరోగ్యానికి ‘అష్యూరెన్స్’
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఓ సహాయకుడిలా పనిచేసే యాప్ అష్యూరెన్స్. ఈ యాప్ అనేకమంది రోగులకు వరంలా మారింది. జబ్బు పడిన వారు యాప్లో వివరాలు పొందుపరిస్తే మెడికల్ ప్రిస్క్రిప్షన్ మొదలుకొని నిపుణులైన వైద్యులతో సంప్రదింపుల వరకు ఈ యాప్ చూసుకుంటుంది. ఈ యాప్ ద్వారా రోగి పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి వారికి ఆహార నియమాలు, వ్యాయామాలను సూచిస్తుందని యాప్ సీఈఓ మనీశ్ వెల్లడించారు.
నవజాత శిశువుల కోసం
నవజాత శిశువులు అతి సాధారణంగా ఎదుర్కొనే సమస్య కామెర్లు. పుట్టిన మొదటి వారంలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. ఈ కామెర్ల నివారణకు ప్రస్తుతం ఫొటో థెరపీ చికిత్స అందుబాటులో ఉంది. ఈ విధానంలో బిడ్డను రోజుల తరబడిగా తల్లికి దూరంగా ఉంచాల్సి వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాద్కు చెందిన హెమాక్ హెల్త్ కేర్ అనే కంపెనీ మీమాక్ ఎన్లైనట్-360 అనే థెరపీ పరికరాన్ని తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఫొటో థెరపీ కన్నా తక్కువ వ్యవధిలోనే నయం చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు బిడ్డను తల్లి అక్కున చేర్చుకునేందుకు వీలుగా దీన్ని రూపొందింనినట్టు సంస్థ ఫౌండర్ ప్రసాద్ ముద్దం తెలిపారు.
‘అవిఘ్న’తో ఉత్తమ సేవలు
కొన్నిసార్లు..ఎందుకు జబ్బు చేసిందో గుర్తించలేకపోతాం. సతమతమవుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మన శారీరక సమస్య ఏమిటో తెలుసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ‘అవిఘ్న’ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది. రోగి తన వివరాలను, లక్షణాలను యాప్లో పొందుపరిస్తే… సమస్య ఎటువంటిదో ఎటువంటి వైద్యుడిని కలవాలో యాప్ సూచిస్తుంది. ఇందులో 500లకు పైగా రోగాలతో పాటు 12 వందల రోగ లక్షణాలను గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. ఈ యాప్ వినియోగంతో అటు డాక్టర్కు, ఇటు రోగికి జబ్బుపై పూర్తి అవగాహన రావడంతో పాటు.. ఎక్కువ సమయం వృథా కాకుండా అనవసర పరీక్షలను నివారించి డబ్బును పొదుపు చేస్తుంది. ప్రస్తుతం జియో హెల్త్ హబ్తో యాప్ కనెక్ట్ అయి ఉండగా రాబోయే రోజుల్లో ప్రాక్టతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 2022 లో రూపొంందించిన ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముంబైలో ఈ యాప్ ప్రధాన కార్యాలయం ఉందని, నగరంలో హైటెక్ సిటీలో కూడా అవిఘ్న యాప్కు చెందిన ఓ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అవిఘ్న ప్రొడక్ట్ మేనేజర్ శ్రీకర్ తెలిపారు. ఇంగ్లిష్లో ఉన్న ఈ యాప్ను త్వరలోనే తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో కూడా తీసుకొస్తామని వెల్లడించారు.
– శ్రీకర్
ఇంతింతై…స్పేస్ రెట్టింపై
జీవ శాస్ర్తాలకు సంబంధించిన పరిశోధనాలయాలు, ఔషధ కంపెనీలకు నిలయమైన జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో కమర్షియల్ స్పేస్కు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లైట్ హౌస్ క్వాంటమ్ జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతానికి 10 లక్షల చదరపుటడుగుల్లో కమర్షియల్ స్పేస్ను కలిగి ఉండగా అందులో 30 కంపెనీలు వారి కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు నియో వాంటేజ్ పార్క్ పేరిట తగిన స్పేస్తో పూర్తి సెటప్ను చేసి అందిస్తున్నాం. రానున్న రోజుల్లో మరో 10 లక్షల చదరపుటడుగుల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– సుబ్రత శర్మ, నియో వాంటెజ్ పార్క్