మేడ్చల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించతలపెట్టిన ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. గతంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్తో పాటు డిప్యూటీ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కారం చూపేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి వినేందుకు జిల్లాస్థాయి అధికారులు దూరంగా ఉంటున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కిందిస్థాయి అధికారులచే దరఖాస్తులను స్వీకరించి వాటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజాలు ఇచ్చిన దరఖాస్తుల విషయమై అధికారులను నిలదీస్తే ఎలాంటి సమాదానం చెప్పకుండా దాటవేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నాలుగు వారాల పాటు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 583 దరఖాస్తులు రాగా.. వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నెల 12వ తేదీ నుంచి మూడు వారాలుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో లా ఆఫీసర్ చంద్రావతి పాల్గొని దరఖాస్తులు స్వీకరించగా, 19వ తేదీన జరిగిన ప్రజావాణిలో డీఆర్వో హరిప్రియ పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. 26న జరిగిన ప్రజావాణిలో సెక్షన్ సూపరింటెండెంట్ గీత, భూపాల్ దరఖాస్తులను స్వీకరించారు. అయితే అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజావాణిలో ఉన్నతాధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు సమాచారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.