సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ ప్రసుత్తం కొనసాగుతోంది. ఇటీవలే నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయంలో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో అదానీ గ్రూపునకు చెందిన కంపెనీ అదాని రోడ్ ట్రాన్స్పోర్టుతో పాటు కెనడాకు చెందిన పెట్టుబడి సంస్థలు కేకేఆర్, ఎన్ఐఐఎఫ్లు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(టీఓటీ) ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.
బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొననున్న పలు సంస్థలు
నగరం ఇతర రాష్ర్టాలకు, మహానగరాలకు ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కోర్ సిటీ 33 రేడియల్ రోడ్లతో ఔటర్ రింగు రోడ్డు అనుసంధానమై ఉంది. ఓఆర్ఆర్పై నిత్యం 1.80లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం 19 ఇంటర్చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా ఇంటర్చేంజ్లను నార్సింగి, కోకాపేట, మల్లంపేట వద్ద నిర్మిస్తున్నారు. ఈగిల్ ఇన్ఫ్రా ఇండియా 2019 నుంచి ఓఆర్ఆర్పై టోల్ను వసూలు చేసే కాంట్రాక్టును నిర్వహిస్తోంది. సీపీపీఐబీ, సీడీపీక్యూ, కేకేఆర్ సంస్థలు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ద్వారా ఇండ్ఇన్ఫ్రావిట్ ట్రస్ట్ ఇండియా హైవే కన్సెషన్ ట్రస్ట్, హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొననున్నాయి. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేకంగా హెచ్జీసీఎల్ను ఏర్పాటు చేసింది. ఇదే సంస్థ నానక్రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఇక్కడి నుంచే ఓఆర్ఆర్ పూర్తి స్థాయిలో నిర్వహణ చేపడుతోంది.
లీజు ద్వారా హెచ్ఎండీఏకు ఆదాయం..
లీజు ద్వారా ఒకేసారి హెచ్ఎండీఏకు సుమారు రూ.7వేల కోట్ల నుంచి 8వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని హెచ్జీసీఎల్ నిర్మాణం చేపట్టి, నిర్వహణ చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై దాదాపు 12 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఓ ఆంగ్ల దినపత్రిక నివేదించింది. బిడ్లను జనవరి 16, 2023లోపు సమర్పించేందుకు గడువును నిర్ణయించారు. తిరిగి బిడ్లను జనవరి 23న తెరిచేలా హెచ్జీసీఎల్ అధికారులు షెడ్యూలును ఖరారు చేశారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఎన్ఓఆర్ఆర్) పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 30 సంవత్సరాల పాటు టోల్, ఆపరేట్ , బదిలీ ప్రాతిపదికన నిర్వహించడానికి బిడ్లను పిలిచింది. ఆసక్తి ఉన్న సంస్థలు జనవరి నాటికి బిడ్లను సమర్పించే అవకాశం ఉంది. వీటిలో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ (సీపీపీ) ఇన్వెస్ట్మెంట్స్, సీడీపీక్యూ, ఇన్వెస్టర్లు కేకేఆర్, క్యూబ్ హైవేస్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) ఎడిల్వీస్ కంపెనీ మద్దతుతో సుకుర రోడ్స్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు, స్ట్రాటజిక్ సోర్స్ ప్లేయర్గా అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్లు ఈ జాబితాలో ఉన్నాయి.