డెయిరీ టర్నోవర్ను 240 కోట్ల నుంచి 700 కోట్లకు పెంచగలిగాం
డెయిరీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ
నగర వ్యాప్తంగా ఔట్లెట్లను విస్తరిస్తాం
విజయ ఐస్క్రీమ్స్ పుష్ కార్ట్స్ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
ఖైరతాబాద్, ఏప్రిల్ 9: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విజయ డెయిరీ పరిస్థితి దయనీయంగా ఉండేది. కేవలం రూ.240 కోట్ల టర్నోవర్తో ఇబ్బందుల మధ్య కొనసాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు రూ.700 కోట్లకు పైగా టర్నోవర్తో అభివృద్ధిలో దూసుకుపోతున్నది’ అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐస్క్రీమ్ పుష్ కార్ట్స్ను పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా, విజయ డెయిరీ డైరెక్టర్ రాంచందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ పి.విజయారెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ గడిచిన ఏడేండ్లలో విజయ డెయిరీ బాగా అభివృద్ధి చెందిందని, ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఔట్లెట్లను విస్తరించడం, రెండువేల వరకు ఔట్లెట్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. విజయ బ్రాండ్ అంటేనే ప్రజలందరూ ఇష్ట పడుతారని, దూద్పెడ, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులతో పాటు మన నెయ్యికి ముంబై, పుణెలో డిమాండ్ బాగా ఉందన్నారు. ఈ పుష్కార్ట్లునెక్లెస్రోడ్ ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్ లాంటి పర్యాటక స్థలాలతో పాటు బిర్లా మందిర్ లాంటి క్షేత్రాల వద్ద మార్కెటింగ్ చేయడం ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పాడి మీద ఆధారపడి ఉన్నారని, అలాంటి వారికి ప్రభుత్వం నాలుగు రూపాయల ఇన్సెంటీవ్ ఇస్తున్నామన్నారు. శంషాబాద్లో మెగా డైరీని కూడా నెలకొల్పుతున్నామని, ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు.
విజయ పాలకు రాష్ట్రంతో పాటు హైదరాబాద్కు డిమాండు ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికీ 35 లక్షల లీటర్ల పాలు అవసరం ఉందని, వేరే రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల నుంచి పాలు వస్తున్నాయని, వీటన్నింటిని అధిగమించేందుకు మన పాడి రైతులను ప్రోత్సహించి సామర్థ్యాన్ని పెంచుకుంటామన్నారు. పుష్కార్ట్ ద్వారా జీవనోపాధి పొందాలనుకునే వారికి 50 శాతం సబ్సిడీ ఇవ్వడం ద్వారా వారి కుటుంబానికి చేయూతనందించినట్లు అవుతుందన్నారు. త్వరలోనే నగరంలోని పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో ఔట్లెట్లు రాబోతున్నాయని, మాదాపూర్, విజయనగర్ కాలనీలో ఎక్కడా చూసినా మంచి డిమాండ్ వస్తుందని, ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని అన్నారు.