హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత కొన్ని నెలలుగా కళాశాలల్లోని క్లాస్ రూమ్లు, హాస్టళ్లు, టాయిలెట్లలో అత్యంత విషపూరిత పాములు, తేళ్లు కనిపిస్తున్న ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇటీవల పరీక్షలకు సన్నద్ధమవుతున్న మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులిద్దరూ వేర్వేరు ఘటనల్లో తేలు కాటుకు గురవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. మరోవైపు సోమవారం సైతం యాదాద్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ విద్యార్థిని బాత్రూమ్కు వెళ్తుండగా.. సింక్పై పెద్ద పాము కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురైంది. విద్యార్థిని ఆ వీడియోను తీయడంతో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇక మహబూబ్నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సైతం తరచూ పాములు కనిపిస్తుండగా ఆ వీడియోలను పలువురు విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’కు పంపి తమ సమస్యను వివరించారు.
పూర్తిస్థాయి వసతులు లేకపోవడంతో..
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని కొత్త మెడికల్ కాలేజీలను అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ నిర్వహించడం సమస్యకు కారణమవుతున్నది. వికారాబాద్, మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలు పంట పొలాల్లో ఉండటంతో తరచూ పాములు వస్తున్నాయని వాపోయారు. కొన్నిచోట్ల షెడ్డుల్లో హాస్టళ్లు, మెస్లు నడుపుతున్నారని, దీంతో తరచూ పాములు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. హాస్టళ్ల నుంచి మెస్లు 300-400 మీటర్ల దూరంలో ఉండటంతో రాత్రివేళల్లో ఎక్కడ పాములు, తేళ్లు కాటు వేస్తాయోనని హడలిపోతున్నట్టు చెప్పారు.
సంక్షోభంలో విద్యార్థుల సంక్షేమం..
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో వైద్య విద్యార్థుల సంక్షేమం సంక్షోభంలో చిక్కుకున్నది. కాలేజీలు, హాస్టళ్లలో కనీస వసతులు కల్పించడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. వర్షాకాలంలో పాములు, తేళ్ల బెడద అధికమవుతున్నదని తెలిపాయి. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో నెలకొన్న పరిస్థితులను ఇటీవల వైద్య సంఘాలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లాయి. డీఎంఈ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేయిస్తామని తెలిపినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెదక్ ఘటనతోనైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.