బేగంపేట్, మార్చి 23: ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్రమం త్వరలో అమలు కాబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు వచ్చిన స్థానికులతో అభివృద్ధి విషయమై చర్చించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు.
60, 70 ఏండ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కేసీఆర్ ప్రభుత్వంలో పరిష్కారమయ్యాయనిమంత్రి తలసాని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘ కాలిక సమస్యలు అనేకం పరిష్కరించినట్లు వివరించారు. గతంలో సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, ఇక్కడి ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో సనత్నగర్ నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి తలసాని వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్న వారి ఇబ్బందులను గుర్తించిన తాను అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆ స్థలాలను నామమాత్రపు ధరలకే నివసిస్తున్న వారికి కేటాయించినట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి..పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
పేదింటి ఆడపడుచుల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో పేదలు అధికంగా ఉండే బస్తీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు వివరించారు. వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రిల్లో లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లను కూడా గాంధీ, నిమ్స్లలో ఉచితంగా చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కార్ దవాఖానకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.