మెహిదీపట్నం, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ 9 వారాలపాటు జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోల్కొండ కోట బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇక్కడ జరిగే బోనాలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బోనాలను సమర్పిస్తారు.
ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పణ..
గురువారం రోజు గోల్కొండ బోనాలు లంగర్హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభం అవుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు వారికి పట్టువస్ర్తాలను లంగర్హౌస్ చౌరస్తాలో అందజేయనున్నారు. లంగర్హౌస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడాబజార్, ఛోటాబజార్ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలిపూజ ముగుస్తుంది. బడాబజార్లో ఆలయ పూజారి అనంతచారి ఇంటి నుంచి అమ్మవారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం జరిగాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని దేశ రాజధాని ఢిల్లీలో చాటి చెప్పేందుకు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథ్, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బోర్లకుంట వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్జాజు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
గోల్కొండ బోనాలు గురువారం నుంచి నగరంలో ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు గోల్కొండకు వచ్చే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. బోనాల పూజ కార్యక్రమాలు ఈనెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్గూడ నుంచి మక్కీ దర్వాజ మీదుగా గోల్కొండ కోట, లంగర్హౌస్ నుంచి ఫతేదర్వాజా మీదుగా గోల్కొండ, సెవెన్ టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే రూట్లలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
బోనాలకు వచ్చే భక్తుల పార్కింగ్ స్థలాలు..