మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికుల జీతం మరో రూ.1,000 పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి, స్వరాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగుసార్లు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచింది. ప్రభుత్వ పనితీరును కార్మికులు కొనియాడుతూ మంగళవారం సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సల్లగుండాలని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అభిప్రాయపడ్డారు.
అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల కష్టసుఖాలు తెలిసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కార్మికులు కూడా ఆదే కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీలో 25,613 మందికి, జలమండలిలో 4వేల మందికి లబ్ధి చేకూరిందని వారు తెలిపారు.
కార్మిక సంఘాలు సీఎం కేసీఆర్ వెంటే..
సిటీబ్యూరో, మే 2 ( నమస్తే తెలంగాణ) : పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్కేవీ నాయకులు రూప్సింగ్, ఉపాధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో కార్మిక నాయకులు సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్కేవీ
ఉపాధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. మేడే కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు తలా వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పనిచేస్తూ జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికి ఇది గొప్ప శుభవార్త అని వివరించారు. కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. కార్మిక సంఘాలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటాయని వివరించారు. కరోనా కష్టకాలంలో మోటార్ వాహన పన్ను రద్దు చేసి డ్రైవర్లకు అండగా నిలిచారని గుర్తు చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు హర్షణీయం
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ.1,000 వేతనం పెంచడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా తార్నాకలోని డిప్యూటీ మేయర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సరైన గుర్తింపు
అన్ని వర్గాల అభ్యున్నతికి ఆహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ కార్మికుల పాలిట దేవుడిగా మారాడని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఇది సరైన గుర్తింపు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచిన సందర్భంగా మంగళవారం గోల్నాక లో పారిశుద్ధ్య కార్మికులతో కలసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కార్మిక పక్షపాతి సీఎం : మేయర్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : మే డే సందర్భంగా సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 పెంచిన సందర్భంగా క్యాంపు కార్యాయలంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంగళవారం కేసీఆర్ చిత్రపటానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షీరాభిషేకం చేశారు. కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచడం సాహోసోపేత నిర్ణయమని మేయర్ ఈ సందర్బంగా అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచలేదని గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలోనే పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం
పారిశుద్ధ్యకార్మికుల వేతనాన్ని రూ. 1000 పెంచి సీఎం కేసీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలను పెంచమని కార్మికులు కోరితే అప్పట్లో గుర్రాలతో తొక్కించి, రబ్బర్బుల్లెట్లతో కాల్పులు జరిపించిన ఘనత నాటి ప్రభుత్వాలది. నేడు సీఎం పేద పారిశుద్ధ్యకార్మికులు కడుపునిండా తినాలనే ఉద్దేశంతో అడగకున్నా, అవసరమైన ప్రతిసారి జీతాలు పెంచుతూ దేవుడిలా ఆదుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చల్లగా ఉండాలని కార్మికులంతా కోరుకుంటున్నారు.
సీఎం సారు మా బతుకులు మార్చిండు
సీఎం కేసీఆర్ ప్రకటించిన జీతాల పెంపుపై చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో పనులు చేసుకుంటూ కుటుంబాలను పోశించుకుంటున్నాం. ఏ ఒక్కరు మా బాధలను అర్థం చేసుకున్న నాథుడే లేడు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేకసార్లు మా జీతాలను పెంచి మా జీవన స్థితిగతులను మార్చారు.
– బి.స్వరూప, పారిశుద్ధ్య కార్మికురాలు, (కుత్బుల్లాపూర్)
జీతాలు పెంచడం సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను గుర్తించి మూడోసరి ముచ్చటగా రూ. వేయ్యి పెంచడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు జీతం రూ. 2వేలు మాత్రమే ఉండేది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 15 వేలకు పెంచింది. ఇప్పుడు వెయ్యి పెంచడం సంతోషంగా ఉంది. జీతాలు పెంచిన సీఎం కేసీఆర్కు కృతజ్ఙతలు.
– సురేశ్ , పారిశుద్ధ్య ఆటో డ్రైవర్ పహాడీషరీప్
కష్టాలు తెలిసిన సీఎం..
మా కష్టాలు తెలుసుకున్న సీఎం సారు ఎప్పుడు సల్లంగుండాలే. అడుగకుండానే మా జీతాలు పెంచుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు మా జీతాలు పెంచారు. మేము చేస్తున్న పనికి మెచ్చి కేసీఆర్ సార్ మా జీతాలు పెంచారు. చాలా ఆనందంగా ఉంది. మేడే రోజు వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు చెప్పారు. మా శ్రమను గుర్తించారు.
– అంబర్పేట, ఆండాలు, పారిశుద్ధ్య కార్మికురాలు
అన్నోజిగూడలో..
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రెట్టింపు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బి.కొండల్రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
– ఘట్కేసర్, మే 2
చంపాపేట సిటీ కేఫ్ చౌరస్తాలో..
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ వేయి రూపాయల జీతం పెంచటం పట్ల ఐఎస్ సదన్ డివిజన్కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం చంపాపేట సిటీ కేఫ్ చౌరస్తాలో డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెట్టు భాస్కర్ రెడ్డి, కార్తీక్ గౌడ్, గాజల శివ, పారిశుద్ధ్య సూపర్వైజర్ సత్యం పాల్గొన్నారు.
వెయ్యి రూపాయల నుంచి పనిచేశాను..
ఉమ్మడి రాష్ట్రంలోవెయ్యి రూపాయల వేతనంతో పారిద్ధ్య కార్మికురాలిగా విధుల్లో చేరాను. 2014 వరకు చాలీ చాలనీ వేతనాలు అవి కూడా సమయానికి వచ్చేవి కావు. ఏ సర్కారు కూడా వేతనాలు పెంచలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు ఒకేసారి రూ.18వేలకు వేతనాన్ని పెంచారు. ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు పెంచడం చాలా సంతోషంగా ఉంది.
జయహో కేసీఆర్..
కుంగిపోతున్న బతుకులకు వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు జయహో.. పెగుతున్న ధరలతో జీతాలు సరిపోక వచ్చిన జీవితాలు కుటుంబానికి సరిపోక ఇబ్బందులు పడుతున్న మాకు జీతాలు పెంచడం హర్షణీయం.
– నాగలక్ష్మి, పారిశుద్ధ్య కార్మికురాలు, మల్కాజిగిరి
మా గురించి ఆలోచించిన నేత కేసీఆర్
మా గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ జీతం పెంచడం చాలా సంతోషంగా ఉంది. ముందు ఎప్పుడూ మా గురించి ఆలోచించిన వారు లేరు. సీఎం కేసీఆర్ మా బాధలు తెలుసుకుని మాకు జీతాలు పెంచారు. పెరిగి వెయ్యి
రూపాయిలు ఎంతో ఆసరా అవుతాయి.
– సుశీలమ్మ , పారిశుద్ధ్య కార్మికురాలు, చిక్కడపల్లి
కేసీఆర్ది పెద్ద మనసు
సీఎం కేసీఆర్ది పెద్ద మనసు. మమ్మల్ని ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ వచ్చినంకా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకుంటుండు. రూ.వెయ్యి పెంచడం ఆనందంగా ఉంది. కేసీఆర్ సార్ కు రుణపడి ఉంటాం.
– జ్యోతి, పారిశుద్ధ్య కార్మికురాలు, చాదర్ఘాట్
గతంలో మా గోడు ఎవరూ పట్టించుకోలే..
గతంలో ఏ సర్కారు అధికారంలో ఉన్న మా గోడు పట్టించుకున్న పాపానపోలేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తరువాత తాము చేస్తున్న శ్రమను గుర్తించి జీతాలు పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సారు నిండునూరేండ్లు సల్లగుండాలె.
– కె.నర్సమ్మ,పారిశుద్ధ్యకార్మికురాలు, మూసాపేట సర్కిల్
ఆ సారే మళ్లీ సీఎం కావాలి..
సీఎం సార్కు మా బాధలు తెలుసు కాబట్టే జీతాలు పెంచిండ్రు. కేసీఆర్ సార్కు రుణ పడి ఉంటాము. కేసీఆర్ సీఎంగా ఉన్నన్నీ రోజులు మాకు ఏం తిప్పలు లేదు రాదని మా నమ్మకం. ఆసారే మళ్లీ సీఎం కావాలే. సీఎం సారు మాలోంటోళ్లకు సాయం చేస్తే దేవుడు ఆ సార్కు సాయం చేస్తడు. ఆసారు ఒచ్చినంకనే మాకు జీతాలు పెంచిండ్రు.
– వెంకటమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, గౌతంనగర్
అడగకుండానే నాలుగుసార్లు పెంచారు
నేను 25 ఏండ్లుగా స్వీపర్గా పనిచేస్తున్నాను. మాకు అడగకుండానే నాలుగుసార్లు జీతాలు పెంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. గతంలో జీతాలు పెంచాలని రోడ్లపై ధర్నాలు చేసేవాళ్లం, కేసీఆర్ సీఎం అయ్యాక నాలుగుసార్లు వేతనాలను పెంచి తన గొప్ప మనసును చాటుకున్నారు. గరీబోళ్లు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– డి.ప్రమీల, (కవాడిగూడ),బన్సీలాల్పేట్
దేవతలతో పోల్చడం సంతోషంగా ఉంది
నేను పద్మారావునగర్ ప్రాంతంలో 25 ఏండ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాను. సీఎం కేసీఆర్ మాకు జీతం పెంచుతున్నామని ప్రకటించినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు. మేము చేసేపని చూసి మమ్మల్ని దేవతలతో పోల్చడం ఎంతో గర్వంగా అనిపించింది. ఇంత మంచి ప్రభుత్వానికి, గొప్ప మనసున్న సీఎం కేసీఆర్కు మేమంతా అండగా నిలబడతాం.
– వజ్రమ్మ, (అడ్డగుట్ట)
సీఎం కేసీఆర్ కార్మికులకు పెద్దన్న
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేదోళ్ల ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే కల్యాణలక్ష్మి ఇచ్చి ఆదుకుండు. అదే పేదోళ్ల ఇళ్లల్లో మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచిండు. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో కార్మికులకు పెద్దన్నగా నిలిచాడు.
– గుడ్డేటి రాములమ్మ, హయత్నగర్
సీఎం సార్ మనసున్న మారాజు
సీఎం సారు సఫాయి పనోళ్ల బాధలను చూసి మా బత్కులల్లో వెలుగులు నింపిండు. రోడ్లు ఊకి, మోరీలను సాపు చేసేటోళ్లకు జీతాలు పెంచిండు. మనసున్న మారాజు సీఎం సార్ తెలంగాణ గవర్నమెంటు మాకు అడుగకున్నా జీతాలు పెంచినందుకు సీఎం సార్కు ధన్యవాదాలు.
– ప్రభావతి పారిశుద్ధ్య కార్మికురాలు, మహేశ్వరం
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
మున్సిపల్ కార్మికుల పనిని గుర్తించి జీతాలను పెంచిన సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. కార్మికుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం జీతాలను సకాలంలో పెంచింది.జీతం పెంచడం వల్ల కుటుంబానికి
ఆర్థికంగా అండగా నిలుస్తాము.
– సుగుణమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, రెడ్హిల్స్
కార్మికుల బాధలు తెలిసిన గొప్ప సీఎం
కార్మికుల బాధలు తెలిసిన గొప్ప ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సార్. తెలంగాణ వచ్చినాకనే మా బతుకులు మారినయి. ఇంకొకసారి మాకోసం ఆలోచించి జీతాలు పెంచిన గొప్ప సార్ కేసీఆర్. సాఫాయి కార్మికుల తరఫున సార్కు ధన్యవాదాలు.
– రేణుక, స్వీపర్,కొండాపూర్
పనిని గుర్తించి గౌరవించారు..
మేము చేస్తున్న పనిని గుర్తించి, మాకు తగిన గౌరవం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఆయనకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. మా జీతాలను పెంచి, సమాజంలో మంచిగా బతికేలా అవకాశం కల్పించారు. ప్రత్యేక రాష్ట్రంలో మాకు తగిన గుర్తింపు దక్కింది. కరోనా పరిస్థితుల్లో ఎవరూ బయటకు రాలేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చినప్పటికీ, మా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నారు.
– మైసయ్య, పారిశుద్ధ్య కార్మికుడు, తార్నాక