సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పదేండ్ల ప్రగతి, అస్తిత్వంపై రచయితలతో సమాలోచన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఈ మేరకు సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు రచయితలు పోషించిన చారిత్రాత్మక పాత్రపై తెలంగాణ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉన్నదన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కవులను ఆత్మీయంగా సతరించుకుంటున్నదని గుర్తు చేశారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెబుతూ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కవిసమ్మేళనాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రగతితోపాటు మన సాహిత్య, సాంసృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ కవితలు, పద్యాలను రచించి 33 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలను నిర్వహించనున్నట్లు పేరొన్నారు. కవులు రాసిన కవితలు, పద్యాలను దశాబ్ది ఉత్సవాలకు గుర్తుగా తెలంగాణ సాహిత్య అకాడమీ సంకలనంగా తీసుకొస్తుందన్నారు. పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, పచ్చటి పంట పొలాలతో సంక్షేమ తెలంగాణగా వర్దిల్లుతున్న తీరును కవితల్లో రాయాలని సూచించారు. దాశరథి, కాళోజీ, సినారె, బిరుదురాజు రామరాజు, భాగ్యరెడ్డి వర్మ, కొమర్రాజు, బీఎన్ శాస్త్రి, బోయ జంగయ్య, జాతశ్రీ లాంటి తెలంగాణ తేజోమూర్తులను గుర్తు చేసుకుంటూ స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకోవచ్చని తెలిపారు. కవిసమ్మేళనాల్లో వచన, పద్య కవిత్వంలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. వచన, పద్య కవిత విభాగాల్లో ప్రథమ బహుమతి రూ.లక్ష 116, ద్వితీయ రూ.75,116, తృతీయ రూ.60,116, చతుర్థ రూ.50,116, పంచమ రూ. 30,116 ఇవ్వనున్నట్లు తెలిపారు.