సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం… అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దుస్సాహసాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు అత్యంత చాకచక్యంగా ‘క్యాషాయం’ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఇంత భారీ కొనుగోలు రాకెట్ను ఛేదించిన పోలీసులను మూడు రోజుల కిందట నిందితులను రిమాండ్ చేశారు. అయితే, పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో రోజున్నర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం… న్యాయస్థానం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో తిరిగి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది.
ఉత్కంఠ.. హై కోర్టు ఆదేశాలతో ఊరట
మొయినాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హస్తినాలో బీజేపీని సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వందల కోట్లు ఎరగా వేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదుతో నిందితుల్లో ఒకరైన నందకుమార్పై నిఘా పెట్టారు. ముఖ్యంగా ఫాం హౌజ్లోకి ఇద్దరు స్వామీజీలతో పాటు నందకుమార్ వస్తున్న రోజు పోలీసులు భారీ స్కెచ్ వేసి.. విజయవంతమయ్యారు. ఫాంహౌజ్లో నాలుగు కెమెరాలతో పాటు మరో రెండు వాయిస్ కెమెరాలను వినియోగించారు.
ఎమ్మెల్యేలు ఎక్కడ, ఎలా కూర్చోవాలి? వచ్చే వారిని ఎలా కూర్చోబెట్టాలి? ఆధారాలు స్పష్టంగా ఉండేందుకు ఎలా మాట్లాడాలి.? పోలీసులు ఇలా ప్రతి ఒక్కటీ పక్కాగా స్కెచ్ వేయడంతోనే ఆడియో, వీడియోల రూపంలో పక్కా ఆధారాలు లభించాయి. దీంతో ఈ నెల 26 రాత్రి పోలీసులు బయటపెట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ రాజకీయాలనే కుదిపేసింది. అయితే, మరుసటి రోజు రాత్రి రిమాండ్ కోసం నిందితులను ఏసీబీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పిటిషన్ తిరస్కరణకు గురికావడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అనంతరం సైబరాబాద్ పోలీసులు వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది.
ముఖ్యంగా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ సాగిన ఆడియో, వీడియో టేపుల వంటి కీలక ఆధారాలు ఉన్నట్లుగా పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. తాము స్వయంగా చేపట్టిన ట్రాప్లో స్వామీజీలు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే రీతిలో మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీంతో నిందితులు తిరిగి పోలీసుల ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు రిమాండ్కు అనుమతించాలని ఏసీబీ కోర్టుకు సూచించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అప్పటి వరకు కేసుకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠ వీడటంతో పోలీసులు తమ తదుపరి చర్యలను ముమ్మరం చేశారు. వెంటనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, రిమాండ్ రిపోర్టును రూపొందించి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.