మేడ్చల్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రస్తుతానికి లేనట్టుగానే కనిపిస్తోంది. ఈ నెల 30న సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 61 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఎన్నికలు ఆలస్యంకానున్న క్రమంలో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను త్వరలోనే ప్ర భుత్వం నియమించే అవకాశం ఉంది.
కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశం మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా డీపీవో కార్యాలయ అధికారులు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేసిన విషయం విధితమే. జిల్లాలో గ్రామపంచాయతీల ఎన్నికలకు అవసరమయ్యే 606 పోలింగ్ కేంద్రాలు, 16 వందల మంది సిబ్బందిని సిద్ధం చేసి ఉంచారు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. వచ్చే ఫిబ్రవరి చివరివారంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు భావిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం పార్లమెంట్ ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది.