భూమి బాగుంటేనే భవిష్యత్తు అనే సెనెటర్ నెల్సన్ ఆలోచనకు ప్రతిరూపమే ధరిత్రి దినోత్సవం. 1962లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది సఫలీకృతం కాలేదు. దీంతో సెనెటర్ నెల్సన్కు మరో ఆలోచన వచ్చింది. వాతావరణంలో జరిగే మార్పులను ప్రజలకు వివరించేందుకు ఒక రోజంటూ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆలోచనకు రూపకల్పన చేస్తూ.. 1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ధరిత్రిని రక్షించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతి ఒక్కరిచే ప్రమాణం చేయించారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాప్తమైంది. అప్పటినుంచి ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే నిర్వహిస్తూ వస్తున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలు, నదులు, వేలాది చెరువులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయమైంది పుడమితల్లి. కోట్లాది వృక్షాలను తనలో విలీనం చేసుకొని మలినాలను రూపుమాపి స్వచ్ఛమైన గాలి, నీరు అందిస్తున్నది. అయితే అనునిత్యం విషవ్యర్థాల కోరల్లో చిక్కుకొని కాలుష్య కాసారంలా మారుతున్న ‘ధరిత్రిని రక్షించు.. సిరిసంపదను సృష్టించు..’ అనే నినాదంతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలనే దృఢసంకల్పంతో తెలంగాణకు హరితహారం పేరుతో పచ్చదనం పరిఢవిల్లేలా ప్రణాళికలు రూపకల్పన చేశారు. హరిత వనాలను పెంపొందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వార్నింగ్ ఇస్తున్న గ్లోబల్ వార్మింగ్కు తెలంగాణ రాష్ట్రంలో హరితహారం, గ్రీన్ చాలెంజ్ లాంటి కార్యక్రమాలతో చెక్ పెడుతున్నారు.
పుడమి తల్లి ఒడిలో హరిత ఆర్థిక వ్యవస్థ సృష్టికర్త..
ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దుతున్న విధానం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని హరిత ప్రేమికులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు అనేక ప్రాంతాలు నెర్రెలు బారిన నేలలుగానే దర్శనమిచ్చేవి. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారంతో భూమాతకు పచ్చని హారతి పట్టి, ఎడారిలాంటి ఎత్తైన ప్రాంతానికి కాళేశ్వరంతో నీళ్లు తెచ్చి భూమాతను పులకరింపజేసిన ఘనత అపర భగీరథుడు సీఎం కేసీఆర్దేనని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. 2022 ధరిత్రి దినోత్సవాన్ని హరిత ఆర్థిక వ్యవస్థ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్కు అంకితమివ్వాలని కోరుతున్నారు.
ప్రకృతిని కాపాడుకుందాం..
సేవ్ సాయిల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన స్వామీజి సద్గురు పిలుపునకు మద్దతుగా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సభ్యులు గురువారం అల్వాల్లోని పల్లవి పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. మట్టిని రక్షించుకుందాం.. ప్రకృతిని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ 3 కిలో మీటర్ల మేర సైక్లింగ్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీజీ ఫౌండర్ రవీందర్, పల్లవి పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.
దేశాన్ని ఆకర్షించిన గ్రీన్ ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పచ్చదనాన్ని పెంపొందించడంలో దేశాన్ని ఆకర్షించింది. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై పచ్చని అందాలను కోల్పోయి కన్నీరు కారుస్తున్న సందర్భంలో సంతోష్కుమార్ తీసుకున్న నిర్ణయం ఎందరినో కదిలించింది. ఇప్పుడది దేశవ్యాప్త ఉద్యమంగా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సెలబ్రెటీలు మొక్కలు నాటుతూ.. ఒకరికి ఒకరు చాలెంజ్ విసురుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా హరిత ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతేగాకుండా వినాయక చవితిని పురస్కరించుకొని ‘సీడ్ గణేశా’ పేరుతో పర్యావణాన్ని కాంక్షించే కార్యక్రమాన్ని పలు సంస్థలతో కలిసి ముందుకు తీసుకెళ్లి నేలతల్లి కలుషితమవ్వకుండా నిత్య కృశీవలుడుగా నిలుస్తున్నారు.
హరిత వేదికగా తెలంగాణ
హరిత వేదికగా తెలంగాణను అన్ని రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. కాలుష్య కారక అంశాలైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్థాల పునర్వినియో గం, పంటలు పండించేందుకు రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను విరివిగా వాడాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అప్పుడే ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతుంది. ఇది మానవ జీవనప్రమాణ స్థాయి పెరగడానికి తోడ్పాటును అందిస్తుంది. హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు నాణ్యమైన జీవనాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.
– ఎం.లింగస్వామి, గెస్ట్ ఫ్యాకల్టీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఓయూ
ప్లాస్టిక్ వాడకమే పెనుముప్పు
భూతాపం పెరగడానికి ప్రధాన కారణం విపరీతమైన ప్లాస్టిక్ వాడకమే. ఉదయం లేవడం నుంచి మొదలుకొని నిద్రపోయేవరకు.. ప్రతి మనిషి ప్లాస్టిక్ వినియోగానికి అలవాటు పడిపోయాడు. ఈ విధానం ఇలాగే కొనసాగితే మానవ జీవన విధానానికి ప్రతికూల అంశాలు ఎదురుకాక తప్పదు. ఎంతో దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందించాల్సిందే. మిగతా రాష్ర్టాలు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా అడవులు గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియన్ (ఎఫ్ఎస్ఐ) ప్రకారం 2021లో గణనీయంగా పచ్చదనం పెరిగింది.
– రఘురామరావు, పర్యావరణవేత్త