రంగారెడ్డి/మేడ్చల్, అక్టోబర్ 18, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సమయంలో ప్రత్యేక నిధులు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధి నిధులను ప్రభుత్వం ఇస్తుండగా, మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లాల ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి.. నెల రోజుల్లోనే మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాలకు రూ.80 కోట్ల నిధులు, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు..
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాలతోపాటు మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాలకు రూ.130 కోట్ల ప్రత్యేక నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, సంబంధిత నిధులను ఆయా నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గం అభివృద్ధి నిధుల్లో అధిక ప్రాధాన్యత ఎస్సీ, ఎస్టీ జనాభాగల ప్రాంతాలకు ఇవ్వనున్నారు. గిరిజన తండాలతోపాటు ఎస్సీ కాలనీల్లో సీడీపీ నిధులను అధికంగా ఖర్చు చేయనున్నారు. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. అయితే, గిరిజన తండాల అభివృద్ధికి 10 శాతం నిధులను, ఎస్సీ కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు 20 శాతం మేర నిధులను వినియోగించనున్నారు. అదేవిధంగా సీడీపీ నిధుల్లో 40 శాతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అదనపు గదుల నిర్మాణంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఆట స్థలాల అభివృద్ధి, సైన్స్ ప్రయోగశాల, తాగునీటి వంటి మౌలిక వసతులకు ఖర్చు చేయాల్సి ఉంది. ఇవేకాకుండా అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, ప్రభుత్వాసుపత్రుల మరమ్మతులకు సంబంధించి కూడా నిధులను ఖర్చు చేయనున్నారు.
మేడ్చల్ జిల్లా మరింత అభివృద్ధి
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 50 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ప్రత్యేక నిధులతో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. నియోజకవర్గాల ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పిస్తాం. ప్రత్యేక నిధులతో రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతాం. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు…
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగానే నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 13 నియోజకవర్గాల అభివృద్ధికి రూ.130 కోట్లు మంజూరు చేశారు. ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రత్యేక నిధులు మంజూరు చేయడం హర్షణీయం
చేవెళ్ల ఎంపీ డా.జి.రంజిత్ రెడ్డి
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. నిధులు మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం హర్షణీయం.