హైదరాబాద్ : గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘నీరా కేఫ్’ నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాలతో దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించి గీత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.
నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నవంబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితోపాటు యాదాద్రి – భువనగిరి జిల్లాలోని నందన వనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యాయన కేంద్రం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.