సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఓటర్లను చైతన్యపరిచి, ఓటింగ్ శాతం పెంచే దిశగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టి ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి.. ఓటు ప్రాధాన్యత తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు వేయాలని, ‘ఓట్ ఫర్ ష్యూర్’, ‘నేను తప్పకుండా.. ఓటు వేస్తాను’ అని ప్రతిజ్ఞ చేయిస్తూ.. అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.