అల్లాపూర్, మార్చి 4 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయడంతోపాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలో పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న రాజీవ్ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రానికి పరీక్షలు చేయించుకునేందుకు లబ్ధిదారులు నిత్యం క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2,787 మందికి కంటి పరీక్షలు చేసి వారిలో 500 మందికి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి శస్త్రచికిత్సలకు 370 మందిని రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అధునాతన పరికరాలను కంటివెలుగు కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి కంటి అద్దాలను అందిస్తున్నది. శస్త్ర చికిత్సలకు కూడా రిఫర్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎంతో ఆసక్తిగా పరీక్షా కేంద్రాలకు తరలివెళ్తున్నారు.
నాకు కండ్లు మబ్బుగానే కనిపించేవి. కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైద్య సిబ్బంది కండ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎవరూ ఇలాంటి పనులు చేయలే. పేదల కోసం సీఎం కేసీఆర్ ఇలాంటి మంచి పథకాలు ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది.
– ఆవుల సంజీవ, రామారావునగర్
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని అల్లాపూర్ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కండ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు అవసరమున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేస్తారు.
– సబీహాబేగం, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్