రంగారెడ్డి, జూన్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ అవతరణ – దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి దశాబ్ది ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రజా సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ మోడల్ ఆదర్శం..
తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందతున్నదని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశం అచ్చెరువొందే రీతిలో పలు పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో స్వర్ణ యుగాన్ని లిఖించినదని తెలిపారు.
F రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, సీఎం కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడంతో 2014 – 15 నుంచి 2019 – 20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డీపీ వృద్ధి రేటు 13.2%కి పెరిగింది. 2014 -15 నుంచి 2019 – 20 వరకు రంగారెడ్డి జిల్లా వార్షిక జీఎస్డీపీ వృద్ధి రేటు 17.2 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా నిలించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయ రంగం పండుగలా మారిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్.హరీశ్, జడ్పీ చైర్ పర్సన్ డా. అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి పద్మజా రమణ అమరుడైన శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలు – అభివృద్ధి…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ ఐ పాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పలను తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు టీఎస్ ఐ పాస్ వద్వారా 1715 పరిశ్రమలు దరఖాస్తు చేసుకోగా, 1252 పరిశ్రమలు 47 వేల 62 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 5 లక్షల 15 వేల 851 మందికి ఉపాధి కల్పించబడినట్టు పేర్కొన్నారు. అనంతరం ఏడుగురు ట్రాన్స్జెండర్స్కు 100% సబ్సిడీతో రూ.50 వేల రుణ సదుపాయం ఆర్థిక పునరావాస పథకం (ఇఆర్ఎస్)లో భాగంగా చెక్కులను అందించారు.