మూడు టిమ్స్ దవాఖానలకు పాలనా అనుమతులు
ఇప్పటికే గచ్చిబౌలిలో సేవలందిస్తున్న టిమ్స్
ఎల్బీనగర్, సనత్నగర్,అల్వాల్లో నిర్మాణానికి పచ్చజెండా
రూ.2,679 కోట్లతో ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు
టర్న్కీ పద్ధతిన టెండర్లకు ఆహ్వానం
స్వయం ప్రతిపత్తి విధానంలో టిమ్స్ల నిర్వహణ
ఉస్మానియా, గాంధీ, నిమ్స్లపై తగ్గనున్న ఒత్తిడి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
నగరం చుట్టూ 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్కు పురపాలక మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. టిమ్స్ దవాఖానల వల్ల ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందుతాయని ఆకాంక్షించారు.
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ గురువారం జీవో 41ను విడుదల చేసింది. కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి. ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్లమార్కెట్) సనత్నగర్ (ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి) అల్వాల్ (బొల్లారం)లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించనుండగా, టర్న్కీ పద్ధతిన టెండర్లు ఆహ్వానించాలని ఆర్అండ్బీ ఈఎన్సీని సర్కారు ఆదేశించింది. ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్తోపాటు నూతనంగా నిర్మించబోయే మూడు టిమ్స్ దవాఖానలకు స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. మూడు నయా ఆస్పత్రులు అందుబాటులోకొస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్లపై ఒత్తిడి చాలా తగ్గనుంది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా, గాంధీ, నిమ్స్.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. కాని స్వీయ పాలనలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్ మహా నగరం వేదిక కాబోతున్నది. ఇప్పటికే గచ్చిబౌలిలోని టిమ్స్ ప్రజలకు సేవలు అందిస్తుండగా.. మరో మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా ఆస్పత్రుల నిర్మాణం చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్లో రూ.2,679 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పాలనా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ జీవో 41జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏ మూలన నిరుపేదలు ఏ వ్యాధిబారిన పడినా.. కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్యం అందించేందుకు నగరం నలువైపులా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు ఏర్పాటు కాబోతున్నాయి. గచ్చిబౌలి టిమ్స్ గత రెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుండగా.. త్వరలోనే మిగిలిన మూడింటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని రూ.2,679 కోట్లతో చేపడుతుండగా.. ఒక్కో ఆస్పత్రిని 13,71,220 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. మొదటి బ్లాక్ను 10,53,800 చదరపు అడుగులు, రెండో బ్లాక్ 3,17,420 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. కాగా ఆస్పత్రుల నిర్మాణ పనులకు సంబంధించి వెంటనే టర్న్కీ పద్ధతిలో టెండర్లను పిలువాల్సిందిగా ఆర్అండ్బీ ఇంజినీర్-ఇన్-చీఫ్ను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విధానంలోనే ఈ మూడు ఆస్పత్రులను కూడా టర్న్కీ పద్ధతిలో నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డిజైన్ మొదలుకొని భవనాల నిర్మాణం, అందులో మౌలిక వసతుల కల్పన వరకు అన్నింటిని ఏజెన్సీనే సమకూర్చి.. ప్రభుత్వానికి అప్పగిస్తుంది. చదరపు అడుగుల ప్రాతిపదికన ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వయం ప్రతిపత్తితో ఆస్పత్రుల నిర్వహణ
నగరానికి నలువైపులా ఉండే నాలుగు టిమ్స్ దవాఖాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సాధారణంగా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు వైద్యారోగ్య శాఖ ఆధీనంలో పనిచేస్తాయి. వీటికి బడ్జెట్ అనేది శాఖ కేటాయింపుల్లో అంతర్భాగంగా ఉంటుంది. మరోవైపు వైద్యులు, ఇతర రకాల ఆస్పత్రి సిబ్బంది కేటాయింపులు ప్రభుత్వపరంగా ఉంటాయి. దీంతో పాటు బదిలీలు కూడా ప్రభుత్వ విధానంలోనే ఉంటాయి. కానీ స్వయం ప్రతిపత్తి విధానంలో మాత్రం డైరెక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్పత్రుల నిర్వహణ ఉంటుంది.
ట్రెషరీ దవాఖానలపై తగ్గనున్న భారం
నగరానికి నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి వస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ట్రెషరీ దవాఖానలపై భారం తప్పనున్నది. ప్రస్తుతం ఈ దవాఖానలకు రాష్ట్రం నలువైపుల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ తదితర ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. గ్రేటర్ చుట్టూ సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వస్తే స్వరాష్ట్రంతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే రోగులకు ఎంతో ఉపశమనం లభించనున్నది.
నిమ్స్ తరహాలోనే..
నిమ్స్ ఆస్పత్రి నిర్వహణ డైరెక్టర్ ఆధీనంలో ఉన్నట్లుగానే.. నగరంలోని నాలుగు టిమ్స్ ఆస్పత్రుల నిర్వహణ అనేది టిమ్స్ డైరెక్టర్ ఆధీనంలో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు వైద్యులు మొదలు ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను చేపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం బడ్జెట్ను నేరుగా టిమ్స్కు కేటాయిస్తుంది. తద్వారా చిన్నపాటి మరమ్మతులు మొదలుకొని పరికరాల కొనుగోలు, కీలక నిర్ణయాలు కూడా డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధీనంలోనే ఉంటుంది. దీంతో ఈ ఆస్పత్రుల నిర్వహణపై పర్యవేక్షణ క్షుణ్నంగా ఉండటంతో పాటు నిర్ణయాలు త్వరితగతిన తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.