Talasani Srinivas Yadav | హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్ని కలుపుకొని సుమారు 2 లక్షల వరకు విగ్రహాలను ప్రతిష్టించి, నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభం నుండి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు.
ఒక వైపు వర్షం కురుస్తున్నా అలసిపోకుండా, ఆలస్యమైనప్పటికీ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎంతో ఓపికతో సహకరించిన, ఎంతో బ్రహ్మాండంగా జరిగేలా సహకరించిన ఉత్సవాల నిర్వహకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, పోలీసు, ట్రాఫిక్, శానిటేషన్, హెల్త్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలు, ఉత్సవాల నిర్వహణకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మనోభావాలు, ఆచారాలను గౌరవిస్తూ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుందని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ లో దేశంలోనే హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.