Talasani Srinivas Yadav | మేడ్చల్ మల్కాజ్గిరి : పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు.
ముందుగా కాలనీలో మంత్రి మొక్కలను నాటారు. బహదూర్పల్లిలో రూ. 76.50 కోట్ల వ్యయంతో 900 ఇండ్లు, డీ పోచంపల్లిలో రూ. 140 కోట్ల వ్యయంతో 1620, గాజుల రామారంలో రూ. 11 కోట్ల వ్యయంతో 144 ఇండ్ల సముదాయాలను నిర్మించారు. ర్యాండమైజేషన్ పద్దతిలో డ్రా నిర్వహించి సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తూ మంత్రి పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అని మన పెద్దలు ఎప్పుడు చెబుతుంటారని, ఆ రెండు ఎంతో కష్టతరమైనవని అన్నారు. మన ముఖ్యమంత్రి ఒక వైపు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తుండగా, మరో వైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్న గొప్ప మనసున్న మాహా రాజు అని పేర్కొన్నారు. ఈ ఇండ్లకు ముఖ్యమంత్రి డిజైన్ చేశారని చెప్పారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. లబ్దిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వాలు పేదలకు పలు పథకాల కింద చేపట్టిన ఇండ్ల నిర్మాణాలలో ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయం నామమాత్రమేనని, ఆ ఇండ్లు కూడా ఎంతో ఇరుకుగా ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఇల్లు ఎంతో విశాలంగా 2 బెడ్రూంలు, కిచెన్, హాల్, రెండు టాయిలెట్స్ ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే సదుద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలో 109 ప్రాంతాలలో రూ. 10 వేల కోట్ల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందులో 73 ప్రాంతాలలో 69,532 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 36 ప్రాంతాలలో 30,468 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ ఇండ్లను దశల వారిగా అర్హులైన వారికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొందరు దుర్మార్గులు ప్రజలను తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని… వారి మాటలు పట్టించుకోవద్దని మంత్రి కోరారు.
మొదటి విడతలో జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాలలో ఈ ఒక్క రోజే ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 11, 700 మందికి లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మొదటి విడతలో రానివారు ఆందోళన చెందవద్దని, దశల వారిగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఎన్నో సంవత్సరాల కోరిక సొంతింటి కల నేడు నెరవేరడంతో లబ్దిదారులు ఎంతో ఆనందించారు. ఇండ్ల కేటాయింపు పత్రాలను అందుకున్న పలువురు మహిళలు వేదికపైనే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తమకు ఇల్లు ఉచితంగా నిర్మించి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హౌసింగ్ సీఈ సురేష్, ఈఈ వెంకటదాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.