Sabitha Indra Reddy | బడంగ్పేట, ఏప్రిల్ 21: వేసవికాలంలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మీర్పేట మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలు రాకుండా చూసుకోవాలని కమిషనర్ డీఈలకు ఆదేశాలు జారీ చేశారు.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీలు బ్లాక్ కాకుండా చూడాలని సూచించారు. గుంతలమయంగా మారిన ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయించాలని తెలిపారు. రోడ్లు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
మూడు చెరువుల చుట్టూ వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలన్నారు. చెరువుల పరిస్థితి అధ్వానంగా పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చెరువులలో ఉన్న గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు తొలగించేవారమని ఆమె పేర్కొన్నారు. చెరువులు అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుందరీకరణ చేసిన తర్వాత చెరువులను వెంటనే చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే చెరువులు అధ్వానంగా తయారవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చందన చెరువు వద్ద నూతన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట టాయిలెట్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు. బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న లేబర్ అడ్డాను, స్ట్రీట్ వెండర్స్ షెడ్ వద్దకు తరలించాలని ఆదేశించారు. రైతు బజార్ పక్కన ఉన్న స్ట్రీట్ వెండర్ షెడ్డును ఆక్షన్ ద్వారా లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.