మలక్పేట, డిసెంబర్ 29: మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై గురువారం ఆయన డిప్యూటీ కలెక్టర్ మాలతి, ఎంఆర్ఐ హరిబాబు తదితరులతో కలిసి శాలివాహననగర్లోని అంబేద్కర్ బస్తీ, సాయిలు హట్స్లో పర్యటించి మూసీ ఆక్రమణలను పరిశీలించారు.
ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ఒడ్డున ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములని, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కొందరు బస్తీల లీడర్లు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అమాయక ప్రజలనుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, డబ్బులిచ్చి మోసపోయినవారు తమకు ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రస్తుతం ఆక్రమణకు యత్నించిన స్థలం పక్కనే అంబర్పేట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమికి చుట్టూ ప్రహరీ ఉన్నప్పటికీ అక్రమంగా చొరబడి నిర్మాణాలు చేపట్టారని, వాటి విషయమై అంబర్పేట రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ మాలతి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.