SRH | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్, మార్చి 27 : ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దారులన్నీ ఉప్పల్ స్టేడియం వైపునకే మళ్లాయి. సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ ఉండగా.. సాయంత్రం 4 గంటల నుంచే అభిమానులను లోపలికి అనుమతించారు.
పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగింది. హెచ్సీఏ జారీ చేసిన పాస్లు పక్కదారి పట్టాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లిమెంటరీ పాస్లను బ్లాక్లో అమ్ముతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో అధికారులు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపారు.