వచ్చే నెల 25 నుంచి జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు
సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు సమ్మర్లో తెగ ఎంజాయ్ చేయాలనుకుంటారు. పల్లెటూర్లకు వెళ్లే వాళ్లు కొందరైతే స్విమ్మిం గ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్యారం, చెస్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ తదితర స్పోర్ట్స్లలో ప్రతిభ చాటాలని భావిస్తుంటారు. ఇందుకు జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులను ఎంచుకుంటారు. జీహెచ్ఎంసీ కూడా క్రీడలకు పెద్దపీట వేస్తూ ఔట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్, పెయింటింగ్ తదితర మనోవికాసాన్ని పెంచే గేమ్స్లలో శిక్షణ ఇస్తుంటారు. వచ్చే నెల 25 నుంచి వేసవి శిక్షణ తరగతుల నిర్వహణకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొవిడ్ కారణంగా రెండేండ్ల అనంతరం సమ్మర్ కా్ంయపులను
ప్రారంభిస్తున్నారు.
నగరంలోని అన్ని మున్సిపల్ సర్కిళ్లలో వేసవిలో జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా ఒకటిన్నర లక్షల మంది పిల్లలు సమ్మర్ క్యాంపులకు వస్తుంటారు. మే నెలాఖరు వరకు సమ్మర్ క్యాంపులలో శిక్షణ ఇస్తుంటారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు.
51 క్రీడల్లో 1,386 సమ్మర్ కోచింగ్ కేంద్రాలను ప్రారంభించి 1482 మంది కోచ్ల ద్వారా 1,16,626 మందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
75 క్రీడా మైదానాల్లో వివిధ క్రీడలకు సంబంధించి కావాల్సిన పరికరాలను జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంచింది.