Electricity Demand | సిటీబ్యూరో: విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్గా మారనున్నది. గ్రేటర్లో ప్రతీ ఏటా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ పరిధిలో 2024 డిసెంబర్ నాటికి 62.92లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 2023లో ఈ కనెక్షన్లు 60.26 కనెక్షన్లు ఉండగా, సంవత్సరం పూర్తయ్యేసరికి 2లక్షల కనెక్షన్లు పెరిగాయి. దీనికి సరిపడా ఏర్పాట్లు చేయడం డిస్కంకు సవాల్గా మారింది. అందుకే దీనికి సంబంధించిన కార్యాచరణను నవంబర్లో ప్రారంభించిన డిస్కం దాదాపు సమ్మర్ సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది.
గ్రేటర్లో ప్రతీ వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. 2023లో 3,756 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఉండగా.. 2024లో 16 శాతం పెరిగి 4,352 మెగావాట్లకు చేరుకుంది. 2023 మేనెలలో గరిష్ఠ వినియోగం 81.39 మిలియన్ యూనిట్లు కాగా, 2024లో 12శాతం వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరింది. అయితే ఈసారి 2 లక్షల కనెక్షన్లు అదనంగా పెరగడంతో ఈ సమ్మర్లో విద్యుత్ డిమాండ్ 20 నుంచి 25 శాతం పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు గరిష్ట డిమాండ్ 5వేల మెగావాట్లు కాగా ఈ గరిష్ఠ వినియోగం ఏడాదికి 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశమున్నది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వినియోగం విపరీతంగా పెరుగుతోంది.
ప్రస్తుతం చలితగ్గి ఎండలు పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వాడకం కూడా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలోనే గతేడాది మార్చి వినియోగాన్ని దాటిపోయిందంటే డిమాండ్ ఎంతపెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. జనవరి 31న 3334 మెగావాట్లు కాగా.. గతేడాది మార్చి 31న 3018 మెగావాట్లు మాత్రమే. గతంలో విద్యుత్ వినియోగం చూస్తే మార్చి నుంచి పెరుగుతూ ఏప్రిల్, మే వరకు గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈసారి ఈ నాలుగునెలల్లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉంటుందని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టుగా 220/132/33 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు, ఇతర నెట్వర్క్ పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ రావడం, కొత్తగా వెలసిన కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలు, డెవలప్మెంట్ కారణంగా విద్యుత్ కనెక్షన్లు, డిమాండ్ పెరుగుతున్నదని వారు చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దని, సమస్యలు రాకుండా చూసుకోవాలని టీజీ ఎస్నీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను ఎస్ఈలు తీసుకోవాలన్నారు.