నోటిఫికేషన్ల జారీతో ప్రిపరేషన్లో మునిగితేలుతున్న విద్యార్థులు
హాస్టళ్లతో పాటు కోచింగ్ కేంద్రాల్లో హడావుడి..
తెలుగు అకాడమీ పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణ
సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం పోటీ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ అందులో ఇంటర్వ్యూను రద్దు చేస్తున్న తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగార్థులు స్వాగతిస్తున్నారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ కానుండటంతో రాత పరీక్షకు ప్రాధాన్యం పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. స్వరాష్ట్రంతో కొత్త జిల్లాలు, జోన్ల ఏర్పాటు అనంతరం విడుదలైన నోటిఫికేషన్లతో స్థానిక విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. యూనిఫాం, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సైతం ప్రభుత్వం వయోపరిమితిని పెంచడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేవు.
ఎక్కడ చూసినా హడావుడే..
వరుసగా వస్తున్న నోటిఫికేషన్లతో విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సంసిద్ధమవుతున్నారు. కొందరు ఇండ్లల్లో తమ చదువులను కొనసాగిస్తుండగా మరికొందరు కోచింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ కేంద్రాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ఎక్కడ చూసినా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ కనిపిస్తున్నారు.
తెలుగు అకాడమీ పుస్తకాలకు ఆదరణ..
తెలుగు అకాడమీ, ఇతర పబ్లిషర్ల పుస్తకాల కోసం ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, జనరల్ స్టడీస్ కోసం నిరుద్యోగులు తెలుగు అకాడమీకి పోటెత్తుతున్నారు. డిమాండ్ మేరకు అకాడమీ అదనపు ప్రింటింగ్ కోసం చర్యలు చేపట్టింది. మరో రెండు వారాల్లో అన్ని పుస్తకాలను నిరుద్యోగులకు అందుబాటులోకి తెస్తామని తెలుగు అకాడమీ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఉద్యోగార్థులకు అన్ని ఏర్పాట్లు..
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే అనేక నోటిఫికేషన్లు జారీ చేశారు. భవిష్యత్లోనూ మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. విద్యార్థుల కోసం ఓయూలో ఇప్పటికే సివిల్ సర్వీసెస్ అకాడమీ పేరుతో ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. ఒకేసారి 10 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాక యూనివర్సిటీలోని గ్రంథాలయం, హాస్టళ్లల్లో రీడింగ్ రూమ్లు, స్టడీ అవర్లను సైతం ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తున్నాం. పోటీ పరీక్షల కోసం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాం. – రవీందర్, ఓయూ వీసీ