సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మిగ్జాం ప్రభావంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈదురుగాలులు తీవ్రంగా వీచడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడలేదు. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి విద్యార్థులు, ప్రజలు, పలు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు రాకపోకల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రెండు రోజలపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరవాసులు పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నగరంలో మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.6 డిగ్రీ సెల్సియస్గా, గాలిలో తేమ 80శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మిగ్ జాం తుఫాన్ నేపథ్యంలో నగరమంతా మంగళవారం మేఘావృతమై ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో నీలి మబ్బులు కమ్ముకొని పలు చోట్ల పొద్దుగూకినట్లు తలపించింది. అక్కడక్కడ చిరు జల్లులు కురువగా, కొన్ని చోట్ల వర్షం భారీగా కురిసింది. తుఫాను ఒకవైపు, మరోవైపు చల్లని వాతావరణం అధికమవడంతో నగరవాసులు వణుకుతూ ఆఫీసులకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. ఈ వాతావరణం మరో రెండు రోజులు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.