ఇబ్రహీంపట్నం, మే 29 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లె పల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యకోసం జరుగుతున్న కృషిని, మన ఊరు -మనబడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలన్నారు. గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. కాళేశ్వరం లాగే, పాలమూరు- రంగారెడ్డిని కూడా పూర్తిచేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలియజేశారు.
తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని గర్వంగా చాటుకుంటూ ప్రజలతో మమేకమై ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతుబంధు, రైతుబీమా, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, చెరువుల్లో వదిలిన చేపపిల్లలు, గొర్రెల పంపిణీ వంటి అన్ని రకాల పథకాల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతోపాటు అన్ని రకాల అభివృద్ధి, నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. 20న తెలంగాణ విద్యాదినోత్సవంలో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో జెండాలు ఎగురవేయాలన్నారు. విద్యాలయాలను అందంగా ముస్తాబు చేసి, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలన్నాను, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలన్నారు.
మన ఊరు-మనబడి కింద పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. 22న అమరవీరులకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆరెకపూడి గాంధీ, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిక్జైన్, తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.