సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నేడు) స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం తరపున ఏడుగురు కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ సభ్యులు కొత్తగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలోనే ముందుగానే ఈ కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీలో 13 అంశాలను ఎజెండాగా చేర్చారు. శానిటేషన్, ప్రకటనల విభాగాలపై హౌస్ కమిటీని ప్రకటించడంతో పాటు అత్యధికంగా సీఎస్ఆర్ పద్ధతిలో చెరువుల సుందరీకరణ, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధిపై చర్చించి సభ్యులు ఆమోదించనున్నారు.
పారిశుధ్యం, అడ్వర్టయిజ్మెంట్ విభాగంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రెండు కమిటీలు వేశారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరికి హౌస్ కమిటీలో స్థానం కల్పించారు. శానిటేషన్కు సంబంధించి చైర్ పర్సన్గా మేయర్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులుగా బీఆర్ఎస్ నుంచి రావుల శేషగిరి, సామల హేమ, కాంగ్రెస్ తరపున ఎం.రజిత, వి.జగదీశ్వర్ గౌడ్, బీజేపీ నుంచి డాక్టర్ సురేఖ, శ్రవణ్, ఎంఐఎం సయ్యద్ సోహైల్ ఖాద్రి, డాక్టర్ ఆయేషా హుమేరలను నియమించారు. ఇక ప్రకటనల విభాగం సంబంధించి చైర్ పర్సన్గా మేయర్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులుగా బీఆర్ఎస్ నుంచి సింధూ ఆదర్శ్రెడ్డి, మెట్టు శ్రవణ్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, పి.విజయారెడ్డి, బీజేపీ నుంచి వంగ మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి, ఎంఐఎం నుంచి సయ్యద్ మినహాజుద్దీన్, బి.జబీన్లను నియమించారు.