సిటీబ్యూరో: కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100కోట్ల నిర్దేశిత లక్ష్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడి ఇప్పటి వరకు కేవలం రూ. 1350 కోట్ల మేర మాత్రమే వసూళ్లను రాబట్టుకున్నది. ఈ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండడంతో ఈ నెలాఖరు వరకు మాత్రమే ఆర్థిక సంవత్సరం ముగింపు పెట్టుకొని టార్గెట్ అధిగమించాలన్న లక్ష్యంతో జోన్ల వారీగా స్పెషల డ్రైవ్లు ముమ్మరం చేసింది.
ఈ మేరకు రాబోయే 20 రోజుల్లో రూ. 650 కోట్ల మేర టార్గెట్ను రాబట్టాలని భావించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు విధుల్లో చేరాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలోని 300 డాకెట్ల ద్వారా ట్యాక్స్ వసూలు చేస్తున్న 300 మంది బిల్ కలెక్టర్లు, 145 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఉదయమే రంగంలోకి దిగి.. ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచాలని కమిషనర్ రోనాల్డ్రాస్ ఆదేశాలు జారీ చేశారు.