సుల్తాన్బజార్, ఫిబ్రవరి 11: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ జె.శ్రీలత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి రీజియన్లోని అన్ని డిపోల నుంచి సాధారణ బస్సులతోపాటు అదనపు ప్రత్యేక బస్సులు కలిపి మొత్తం 405 బస్సులు (రెగ్యులర్-స్పెషల్)శ్రీశైలంకు నడపనున్నట్లు ఆమె వివరించారు.
గత సంవత్సరం శివరాత్రి సందర్భంగా 289 బస్సులు నడుపగా.. ఈ ఏడాది ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా నడుపబడే బస్సులకు 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, వాహనాల సిద్ధత, పర్యవేక్షణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకొని శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని ఆమె కోరారు.