Fake Notes | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ డీసీపీ శబరీష్ వెల్లడించారు. నారాయణపేట జిల్లా, కోస్గికి చెందిన కస్తూరి రమేశ్బాబు కారు మెకానిక్గా పనిచేస్తుండేవాడు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో సునాయాసంగా డబ్బు సంపాదించాలని నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి సర్యూలేట్ చేయలనుకున్నాడు.
ఇందులో భాగంగా యూట్యూబ్లో నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన వీడియోలను చూశాడు. సోదరి రమేశ్వరీతో కలిసి నకిలీ నోట్లను తయారు చేశాడు. అయితే వాటిని చెలామణి చేస్తూ 2022లో గోపాలపురం పోలీసులకు చిక్కడంతో రమేశ్బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో అతడి సోదరి బెయిల్పై బయటకు వచ్చింది. రమేశ్బాబు జైల్లో ఉండగా, బహుదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసులో అరెస్టయిన హసన్ బిన్ హమూద్ పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి నకిలీ నోట్లకు సంబంధించిన ప్రింటింగ్, మార్కెటింగ్పై చర్చించుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే రమేశ్బాబు తన కుటుంబాన్ని తాండూర్కు తరలించాడు. తాండూర్లో నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించిన సామగ్రిని తెచ్చి రూ. 500 నకిలీ నోట్లు తయారు చేశాడు.
ఇలా తయారు చేసిన నకిలీ నోట్లను గుజరాత్కు వెళ్లి అక్కడ మొదట చెలామణి చేస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ పోలీసులు గతనెల రమేశ్బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో అతడి సోదరి హసన్బిన్ను సంప్రదించింది. ప్రింట్ చేసిన నోట్లను చెలామణి చేద్దామని ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో ఆమె తన నకిలీ నోట్ల డెన్ను చాంద్రాయణగుట్ట ప్రాంతానికి మార్చింది. ఇద్దరు కలిసి నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందంతో కలిసి వారి డెన్పై దాడి చేశారు. ఈ దాడుల్లో రూ. 27 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్టాప్, ప్రింటర్, నోట్ల తయారీకి వాడని పేపర్ను స్వాధీనం చేసుకున్నారు.