సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మార్గం పెండింగ్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పాతబస్తి మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోను సూచించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ ఆ మార్గంలో రైట్ ఆఫ్ వేకు సంబంధించిన ఆస్తుల గుర్తింపు, తొలగింపు చర్యలు చేపట్టింది. మెట్రో నిర్మించే మార్గం ఖరారు కావడంతో పిల్లర్లు నిర్మించే చోట భూసార పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సుమారు రూ.25 లక్షల వ్యయంతో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ను మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి పనులు చేపట్టే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేస్తున్నామని, త్వరలోనే క్షేత్ర స్థాయిలో భూసార పరీక్షలకు సంబంధించిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక రాగానే ఫిల్లర్లను నిర్మిస్తామని తెలిపారు.