సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): క్రూడ్ ఆయిల్ పెటుబ్టడి అని ఒకరు.. స్టాక్ మార్కెడ్ పడిపోయిందంటూ మరొకరు.. మరిన్ని లాభాలిస్తాం ‘జీరో టూ హీరో’ చేస్తామని మరొకరు నమ్మిస్తూ ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మూడు సైబర్ నేరగాళ్ల ముఠాలు మోసం చేసి రూ.20 లక్షలు దోచుకున్నారు. ఫీర్జాదిగూడకు చెందిన బాధితుడు వృత్తిరీత్యా సాప్ట్వేర్ ఉద్యోగి గత నెలలో ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తుండగా ట్రేడింగ్కు సంబంధించిన ప్రకటన కనిపించింది. ఎంసీఎక్స్ కమాడీటీ క్రూడ్ ఆయిల్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ చానల్లో చేరాడు. అందులో మొదట ట్రేడింగ్ ఎలా చేయాలి.. ట్రేడింగ్లో లాభాలు పొందాలంటే ఎలాంటి షేర్స్ తీసుకోవాలంటూ సూచనలు చేస్తూ అందులో ఉన్న వారికి నమ్మకం కలిగించారు. అందులో పుష్పక్ థాకూరు అనే పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.4 లక్షలు గంట సేపట్లో సంపాదించే మెళకువలు నేర్చుకుంటారంటూ సూచించారు.
అతడి మాటలు విన్న బాధితుడు రెండు దఫాలుగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తాను ట్రేడింగ్ చేస్తున్న యాప్ స్క్రీన్పై లాభాలు కన్పిస్తున్నా… వాటిని విత్ డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో నిర్వాహకులను ప్రశ్నించాడు, మీకు లాభాలు ఎక్కువగా వచ్చాయని, మాకు కమిషన్గా లక్ష రూపాయాలు ఇస్తే.. మీకు విత్ డ్రా చేసుకునే అవకాశముందన్నారు. ఇది మోసమని గుర్తించిన బాధితుడు అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ‘జీరో టూ హీరో’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో చేరాడు. అక్కడ ఉన్న వారు మేం ఎక్కువగా లాభాలొస్తాయని చెప్పబోమని, మీరు మా వద్ద పెట్టుబడి పెడుతూ వెళ్తుంటే మీకే తెలుస్తుందంటూ మాట్లాడారు. దీంతో బాధితుడు వాళ్ల మాటలు నమ్మి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడి పూర్తిగా పోయిందని, మార్కెట్ కుప్పకూలిందంటూ సైబర్ నేరగాళ్లు చెప్పడంతో బాధితుడు మరో టెలీగ్రామ్ గ్రూప్ నిఫ్టీ స్టాక్ ట్రేడ్స్ సెబీ రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న యాప్లో చేరాడు. అక్కడ కూడా దఫ దఫాలుగా రూ.14 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఇక చేసేది లేక మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.