ఖైరతాబాద్ జోన్ బృందం,జూన్ 15: చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లిన తర్వాత ఆయన ఉంటాడో లేడో తెలియని పరిస్థితి.. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో సరికొత్త పాలనా వ్యవస్థ ద్వారా ఇలాం టి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో శుక్రవారం నుంచి వార్డు పాలనా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్నగర్ డివిజన్ల పరిధిలో వార్డు కార్యాలయాలను సిద్ధ్దం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయాలను ముస్తాబు చేశారు.
ఫర్నిచర్తో పాటు ఒక్కో అధికారికి ప్రత్యేకంగా పార్టిషన్లను ఏర్పాటు చేశారు. ఆయా వార్డు కార్యాలయానికి పర్యవేక్షణ అధికారిగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ) వ్యవహరిస్తుండడంతో ఆయనకు కూడా ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఒక్కో కార్యాలయంలో పదిమంది అధికారులు పనిచేయనున్నారు. ఇంజినీరింగ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, శానిటేషన్ , ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్సిటీ, వెటర్నరీ విభాగంతో పాటు టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారి వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. అన్ని వార్డు కార్యాలయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయంతో పాటు ఫ్రింటర్లు, స్కానర్లు, డెస్క్టాప్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతులమీదుగా వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
వార్డు కార్యాలయాలు ఇవే..
బంజారాహిల్స్ డివిజన్(93) వార్డు కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 బంజారా గ్రీన్ కాలనీలోని జీహెచ్ఎంసీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ)గా సాయి శ్రీనివాసరావును నియమించారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్(92)వార్డు కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7లోని మీ సేవ భవనంలో ఏర్పాటు చేశారు. ఉప్పలయ్యను ఏఎంసీగా నియమించారు.
జూబ్లీహిల్స్ (95) డివిజన్కు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ ఇంటర్నేషన్ సెంటర్కు ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా టీ.సంజయ్ను నియమించారు.
హిమాయత్నగర్ (79)డివిజన్కు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని విఠల్వాడీలోని కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా టి.రవీందర్ను నియమించారు.
ఖైరతాబాద్ ( 91 ) డివిజన్కు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లోని దూద్ఖానాలో ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా గోపిని నియమించారు.
సోమాజిగూడ (97 ) డివిజన్కు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని పంజాగుట్ట మెట్రోస్టేషన్ పక్కన పాత ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా సూర్యనారాయణ మూర్తిని నియమించారు.
వివిధ రకాలైన సమస్యలతో వార్డు కార్యాలయానికి వచ్చే పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి సిటిజన్ చార్టర్ ద్వారా నిర్ణీత గడువును విధించారు. ఫుట్పాత్ల మరమ్మతులు, వీధిదీపాల సమస్యలు, చెత్త సేకరణ, నిర్మాణవ్యర్థాలు, పబ్లిక్ టాయ్లెట్స్ నిర్వహణ, యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ తదితర ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు వాటిని ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించడంతో పాటు సంబంధిత ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.